
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు తనను రిటైన్ చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు మహమ్మద్ సిరాజ్ ధన్యవాదాలు తెలిపాడు. తనపై నమ్మకం ఉంచి రిటైన్ చేసుకున్న జట్టుకు టైటిల్ అందించేందుకు కృషిచేస్తానని చెప్పాడు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించాడు. రిటెన్షన్ ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు నలుగురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉండగా.. ఆర్సీబీ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్వెల్, మహ్మద్ సిరాజ్లను ఎంపిక చేసుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన సిరాజ్ ఆర్సీబీకి థ్యాంక్స్ చెప్పాడు. 'నా మీద నమ్మకం ఉంచి రిటైన్ చేసుకున్నందుకు ఆర్సీబీ కుటుంబానికి ధన్యవాదాలు. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. అభిమానులు ఆర్సీబీకి మీ మద్దతును కొనసాగించండి. మమ్మల్ని ప్రేమిస్తూ ఉండండి'సిరాజ్ చెప్పుకొచ్చాడు.
ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ సైతం తనను రిటైన్ చేసుకున్నందుకు ఆర్సీబీకి కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే ఏడాది మరికొన్ని అడుగులు ముందుకేసి టైటిల్ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 'నాపై నమ్మకం ఉంచి రిటైన్ చేసుకున్న ఆర్సీబీకి బిగ్ థ్యాంక్స్. ఈ ఏడాదే మాకు చాలా మంది అభిమానులు అండగా నిలిచారు. వచ్చే ఏడాది టైటిల్ గెలిచేందుకు సాయశక్తుల కృషి చేస్తాం.'అని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు.
మైక్ హెస్సెన్ మాట్లాడుతూ.. 'ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియతో తమకు పెద్ద తలనొప్పిగా మారింది. జట్టులో అసాధారణమైన ఆటగాళ్లున్నారు. వారు నుంచి మెరుగైన ఆటగాళ్లను తీసుకోవడం కష్టమైంది. మెగా వేలంలో తమ ఆటగాళ్లను మళ్లీ తీసుకునేందుకు ప్రయత్నిస్తాం. 'అని చెప్పుకొచ్చాడు. ఈ రిటెన్షన్లో.. కోహ్లీని రూ.15 కోట్లకు ఆర్బీబీ రిటైన్ చేసుకోగా.. మ్యాక్స్వెల్కు రూ.11 కోట్లు, సిరాజ్కు రూ.7 కోట్లు వెచ్చించింది.