హైదరాబాద్: తన తల్లిదండ్రుల పడ్డ కష్టాలకు ప్రతిఫలంగానే గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగానని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. 19 ఏళ్ల వయసు వచ్చే వరకు తనకు షూస్ కూడా లేవని, చెప్పులతోనే బౌలింగ్ చేసేవాడినని గుర్తు చేసుకున్నాడు. తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటే చాలా గమ్మత్తుగా ఉంటుందని, కన్నీళ్లు ఆగవని తెలిపాడు.
ఆసియాకప్ 2023లో శ్రీలంకపై 6 వికెట్లతో సంచలన ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ సిరాజ్.. టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. సంచలన బౌలింగ్తో వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. తాజాగా ప్రముఖ క్రికెట్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్తో మాట్లాడిన సిరాజ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'నాకు 19 ఏళ్లు వచ్చే వరకు చెప్పులతోనే క్రికెట్ ఆడేవాడిని. షూస్ కొనేందుకు కూడా నా దగ్గర డబ్బులు లేవు. మా నాన్న ఆటో నడుపుతూ నాకు రోజు రూ. 70, ఇంజనీరింగ్ చదువుకుంటున్న మా అన్నకు రూ.100 పాకెట్ మనీగా ఇచ్చేవాడు. 70 రూపాయల్లో 40 నా ప్లాటినా బండి పెట్రోల్కే అయిపోయేది. నా బండి సెల్ఫ్ కూడా ఉండేది కాదు. కిక్ కొట్టినా స్టార్ట్ అయ్యేది కాదు.
డక్కా కొట్టి స్టార్ట్ చేసేవాడిని. నేను కాలేజీకి వెళ్లకుండా బంక్ కొట్టి క్రికెట్ ఆడేవాడిని. హైదరాబాద్తో పాటు అనే ఊర్లలో జరిగే క్రికెట్ టోర్నీల్లో పాల్గొనేవాడిని. కాలేజీకి వెళ్లకుండా క్రికెట్ ఆడుతూ అవారగా తిరుగుతున్నానని మా అమ్మ కొట్టేది. మా నాన్నే నాకు రక్షణగా ఉండేవాడు. అన్న ఇంజనీరింగ్ చదవుతున్నాడు. నువ్వు ఎందుకు పనికిరాకుండా పోతున్నావ్ అని మా అమ్మ తిట్టేది.. చితక్కొట్టేది.
మా అమ్మ నుంచి నాన్న రక్షించేవాడు. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడే నేను వెళ్లేవాడిని. ఆయన లేకుంటే నేను కూడా బయటే ఉండేవాడిని. 16 ఏళ్ల వరకు కూడా నేను పెద్దగా క్రికెట్ ఆడలేదు. 16 ఏళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టాను. ముందుగా బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడేవాడిని. ఆ తర్వాత బౌలింగ్కు మారాను.

19 ఏళ్ల వరకు టెన్నిస్ బాల్తోనే క్రికెట్ ఆడాను. గల్లీ క్రికెటర్గానే నా ప్రస్థానం మొదలైంది. ఆ సమయంలో ఓ క్లబ్ తరఫున ఆడే అవకాశం నాకు దక్కింది. తొలి మ్యాచ్లో గ్రేస్ బాల్ పట్టుకున్నాను. అప్పటికి నాకు స్వింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. కేవలం పేస్ మాత్రమే నమ్ముకొని బౌలింగ్ చేసేవాడిని. ఫస్ట్ మ్యాచ్లోనే నా పేస్తో ఐదు వికెట్లు పడగొట్టాను. ఆ ప్రదర్శన నా కెరీర్కు ఉపయోగపడింది.
ఇక ప్రాక్టీస్కు అందరూ మెర్సిడెస్, బెంజ్ కార్లలో వచ్చేవారు. నేను మాత్రం నా డొక్కు ప్లాటినా బైక్లో వచ్చేవాడిని. వారందరికి నా బైక్ కనబడకుండా జాగ్రత్త పడేవాడిని. అందరూ వెళ్లిపోయే వరకు వేచి చూసి బండి డక్కా కొట్టేవాడిని. నా బైక్ చూసి నాకు దూరంగా ఉంటారేమోనని భయపడేవాడిని. ఐపీఎల్తో నా జీవితం మారిపోయింది.
నా తొలి ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులతో ముందుగా ఇళ్లు కొనుక్కున్నాను. ఇప్పటికీ నాకు కార్లంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఇల్లు కొని మా వాళ్లని అందులో ఉంచాలనుకున్నాను. అప్పుడే నాకు ప్రశాంత కలిగింది. నా వారి కోసం ఇళ్లు కొనగలిగాననే సంతృప్తిని ఇచ్చింది. లాక్డౌన్ సమయంలో క్రికెట్లో మెరుగ్గా రాణిస్తే కొనసాగాలని లేకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.

లాక్ డౌన్లో ఉదయం లేవడం ఫిట్నెస్ వర్కౌట్స్తో పాటు గంటలకొద్దీ ప్రాక్టీస్ చేయడం చేశాను. నా దిన చర్యలో ప్రాక్టీస్ మాత్ర ఉండేది. గంటలకొద్దీ నెట్స్లో బౌలింగ్ చేశాను. ఈ ప్రాక్టీస్ నా బౌలింగ్ను మెరుగు పరచడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అప్పటి నుంచి నేను వెనక్కు తిరిగి చూసుకోలేదు.
వెస్టిండీస్కు వెళ్లినప్పుడు క్రీజుకు దూరంగా బంతిని వేసి ఔట్ స్వింగ్ను రాబట్టడం ప్రాక్టీస్ చేశాను. దీని వల్ల పిచ్ అయిన తర్వాత బంతి దిశను మార్చుకుంటూ దూసుకెళ్తుంది. శ్రీలంకపై ఇలాగే అనుకున్నట్లుగా బంతులు వేయగలిగా. ఏనాడూ ఇంత బాగా బౌలింగ్ చేయగలనని అనుకోలేదు. త్రివేండ్రంలో లంకతో వన్డేలో నాలుగు వికెట్లు తీసినప్పుడు అయిదో వికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యా.
ఈసారి మాత్రం 5 వికెట్లు సాధించగలిగా. సరైన ప్రదేశాల్లో బంతులు వేసి ఫలితాలు అందుకున్నా. ప్రపంచకప్ ముందు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే ప్రదర్శన ఇది'' అని సిరాజ్చెప్పుకొచ్చాడు.