కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో ఫైనల్లో 6 వికెట్లతో చెలరేగిన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదంతా కలలా ఉందని తెలిపాడు. ఈ మ్యాచ్లో తాను పెద్దగా కష్టపడింది కూడా ఏం లేదని చెప్పాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన సిరాజ్.. మరో రెండు వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.
అతని ధాటికి శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ అనంతరం తన ప్రదర్శనపై అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇదంతా కలలా ఉంది. గతంలో త్రివేండ్రం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసాను. కానీ ఐదు వికెట్ల ఘనతను అందుకోలేకపోయాను. నా తలరాత ఏంటో తెలిసొచ్చింది.

ఈ రోజు నేను పెద్దగా కష్టపడింది కూడా ఏం లేదు. వైట్ బాల్ క్రికెట్లో నేను ఎప్పుడూ స్వింగ్ బాల్స్ వేస్తాను. ఈ టోర్నీలోని గత మ్యాచ్ల్లో నాకు పెద్దగా స్వింగ్ లభించలేదు. కానీ ఈ మ్యాచ్లో బంతి అద్భుతంగా స్వింగ్ అయ్యింది. కానీ నేను ఔట్ స్వింగర్లతోనే వికెట్లు తీసాను. బ్యాటర్లతో డ్రైవ్ షాట్ ఆడించి వికెట్లు పడగొట్టాను.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
మహమ్మద్ సిరాజ్(6/21) సిక్సర్కు హార్దిక్ పాండ్యా(3/3) తీన్మార్ వేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(17), దుషన్ హేమంత(13 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. లంక బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. జస్ప్రీత్ బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో పదికి పది వికెట్లు పేసర్లే తీయడం విశేషం. 16 బంతుల్లోనే 5 వికెట్లు తీసి అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న బౌలర్గా సిరాజ్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ బౌలర్ చమిందా వాస్ రికార్డును సమం చేశాడు. 2003లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో చమింద వాస్ 16 బంతుల్లోనే 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు.
తొలి 10 ఓవర్లలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న మొదటి భారత బౌలర్గా సిరాజ్ చరిత్రకెక్కాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్గా కూడా సిరాజ్ చరిత్ర సృష్టించాడు. 1002 బంతుల వ్యవధిలోనే సిరాజ్ ఈ ఫీట్ సాధించాడు.