ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా చిరస్మరణీయమైన విజయంతో ముగించింది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన ఆఖరి టెస్ట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 339/6 ఓవర్ నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్(5/104) ఐదు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్ 2-2తో సమంగా నిలిచింది. ఈ ఐదు టెస్ట్ల సిరీస్ చరిత్రలోనే ది బెస్ట్గా నిలిచింది.
ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను జెమీ ఓవర్టన్ రెండు బౌండరీలతో దూకుడుగా ప్రారంభించాడు. కానీ సిరాజ్.. జెమీ స్మిత్(2)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి భారత శిభిరంలో ఆశలు రేకెత్తించాడు. తన మరుసటి ఓవర్లో దూకుడుగా ఆడిన జెమీ ఓవర్టన్(9)ను సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. జోష్ టంగ్(0)ను స్టన్నింగ్ యార్కర్తో ప్రసిధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారగా.. జట్టు కోసం తీవ్ర గాయంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు దిగాడు.

ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు సాహనం చేశాడు. వోక్స్ సాయంతో అట్కిన్సన్ జట్టు విజయం కోసం పోరాడాడు. సిరాజ్ బౌలింగ్లో అతను భారీ షాట్ కొట్టగా.. బౌండరీ లైన్పై ఆకష్ దీప్ క్యాచ్ వదిలేసాడు. దాంతో అది సిక్సర్గా మారింది. ఆ తర్వాతి మూడు బంతులను డాట్ అవ్వగా.. ఆఖరి బంతికి బై రూపంలో సింగిల్ వచ్చింది. దాంతో మళ్లీ అట్కిన్సన్ స్ట్రైకింగ్లోకి వచ్చాడు.
ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో అట్కిన్సన్ మూడు పరుగులు చేసి మళ్లీ స్ట్రైక్ తీసుకున్నాడు. కానీ సిరాజ్.. అట్కిన్సన్ను క్లీన్ బౌల్డ్ చేసి భారత విజయాన్ని లాంఛనం చేశాడు. బంతి బంతికి సమీకరణం మారిన ఈ మ్యాచ్లో విజయం టీమిండియానే వరించింది. మహమ్మద్ సిరాజ్ ఒంటి చేత్తో టీమిండియా ఓటమిని తప్పించాడు. సెంచరీలతో చెలరేగిన జో రూట్, హ్యారీ బ్రూక్లు ఔటవ్వడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.