
హైదరాబాద్: తండ్రి అకాల మరణంతో తీవ్ర విషాదంలో మునిగిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాడు. క్రికెటర్గా రాణించాలనే తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు జట్టుతో పాటు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అతన్ని హైదరాబాద్ పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సన్నద్ధమైనా... సిరాజ్ అంగీకరించలేదు. అయితే టెస్ట్ టీమ్కు సెలెక్ట్ అయిన విషయాన్నే తన తండ్రి మహ్మద్ గౌస్తో చెబుతూ చివరిసారిగా మాట్లాడాడని సిరాజ్ సోదరుడు మహ్మద్ ఇస్మైల్ తెలిపాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లో రాణించి తమ తండ్రికి ఘన నివాళులర్పిస్తానని ప్రామీస్ చేశాడని తెలిపాడు.
'నాన్న.. నేను భారత టెస్ట్ టీమ్కు సెలెక్ట్ అయ్యాను. టెస్ట్ సిరీస్ ఆడటానికి ఆస్ట్రేలియా వెళ్లనున్నాను.'అని సిరాజ్ తమ తండ్రితో ఆఖరిసారిగా అన్న మాటలని ఇస్మైల్ తెలిపాడు. ప్రస్తుతం తమ కుటుంబమంతా తీవ్ర బాధలో ఉందని, తమకు కటుంబ సభ్యులు, బంధువుల తోడు ఉన్నా.. సిరాజ్ ఒంటరిగా ఉన్నాడని తెలిపాడు. అతనితో ఫోన్లో మాట్లాడుదామని ప్రయత్నించినా ఏడుస్తాన్నాడని చెప్పుకొచ్చాడు.
'మహ్మద్ సిరాజ్ నా తమ్ముడు. అతన్ని మేమంతా ఎంతో ఇష్టపడుతాం. మా ఫాదర్కు సిరాజ్ చాలా క్లోజ్. ఇప్పుడు సిరాజ్కు ఫోన్ చేస్తే ఒకటే ఏడుస్తున్నాడు. ఏదైనా మాట్లాడు సిరాజ్ అని చెప్పినా.. నాన్న అంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. నా సోదరుడికి ఆ అల్లా ధైర్యాన్ని ఇవ్వాలి. మా నాన్న మరణంతో నా గుండె కూడా పగిలింది. కానీ నాకు అండగా కుటుంబం, బంధువులు ఉన్నారు. అక్కడ సిరాజ్ ఒక్కడే ఉండిపోయాడు. అతనికి అండగా కాల్చేస్తూనే ఉన్నాను. ఈ సిరీస్లో అద్భుతంగా రాణించి నాన్న ఘన నివాళులర్పిస్తానని ప్రామీస్ చేశాడు.'అని ఇస్మైల్ చెప్పుకొచ్చాడు.