ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్మన్ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్

హైదరాబాద్: మహ్మద్ సిరాజ్ .. ప్రస్తుతం ఈ పేరు భారత క్రికెట్లో మార్మోగుతోంది. ఇటివలే ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ హైదరాబాద్ పేసర్.. తన కెరీర్లో మరో స్థాయికి చేరాడు. ఈ పర్యటనలో ఉండగానే అనారోగ్యంతో అతని తండ్రి మహ్మద్ గౌస్ మరణించినా.. ఆయన కలను నెరవేర్చేందుకు అక్కడే ఉండిపోయాడు. ఆ బాధను పంటి బిగువనే భరిస్తూ అద్భుత ప్రదర్శనతో ఘన నివాళిలర్పించాడు. ముఖ్యంగా గబ్బా టెస్టులో 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి టెస్ట్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గబ్బాలో తమ బౌలింగ్ ప్రణాళిక గురించి తాజాగా సిరాజ్ పంచుకున్నాడు.

అదే మా బౌలింగ్ వ్యూహం
తాజాగా మహ్మద్ సిరాజ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'ఆసీస్ వికెట్లు తీయాలంటే వికెట్కు రెండువైపులా ఒత్తిడి చేయాలన్నది మా వ్యూహం. బ్రిస్బేన్లో శార్దూల్ ఠాకూర్, నేను చర్చించుకున్నాం. ఒత్తిడి చేయాలని నిర్ణయించుకున్నాం. స్కోరు చేయలేని ప్రాంతాలను ఎంచుకొని బంతులు వేశాం. కీలక ఆటగాళ్లు లేనప్పుడు.. ఏ జట్టైనా కొంత ఒత్తిడికి లోనవుతుంది. గాయాల కారణంగా మేమూ గొప్ప ఆటగాళ్ల సేవలు కోల్పోయాం. అయితే మా కోచింగ్, సహాయ సిబ్బంది అండతోనే రాణించగలిగాం. వికెట్కు రెండు వైపులా కట్టుదిట్టమైన బంతులతో ఒత్తిడి పెంచితే బ్యాట్స్మన్ కచ్చితంగా తప్పులు చేస్తారు. గబ్బాలో అదే జరిగింద. మేం ఇద్దరం ఉక్కిరిబిక్కిరి చేశాం. ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్లు ఇచ్చారు' అని తెలిపాడు.

అందుకే ట్రోఫీని నటరాజన్కు ఇచ్చారు
గాయపడ్డా బౌలింగ్కు దిగిన నవదీప్ సైనీ, అరంగేట్రంలోనే అదరగొట్టిన టీ నటరాజన్ను హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ ప్రశంసించాడు. 'అరంగేట్ర మ్యాచ్ కావడంతో మేం గెలిచిన ట్రోఫీని నటరాజన్కు ఇవ్వాలని కెప్టెన్ అజింక్య రహానే, కోచ్ రవిశాస్త్రి నిర్ణయించారు. నటరాజన్ నెట్ బౌలర్గా వచ్చాడు. టీ20, వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతడో గొప్ప బౌలర్. ప్రశాంతంగా ఉంటాడు. అతిగా మాట్లాడడు. తన పనేంటో తెలుసు. అతడు నమ్మశక్యం కాని యార్కర్లు వేయగలడు. ఇక సైనీ గాయపడ్డా బౌలింగ్ చేశాడు. జట్టు విజయం కోసమే ఆడాడు' అని సిరాజ్ చెప్పాడు.

కోహ్లీ అండగా నిలిచాడు
'2019 ఐపీఎల్లో రాణించకపోవడంతో 2020 సీజన్ నాకు కీలకమని తెలుసు. అందుకే లాక్డౌన్లో బౌలింగ్ మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించా. ఒకే స్టంప్ పెట్టుకుని ప్రాక్టీస్ చేశా. అందుకే ఐపీఎల్ 2020తో సహా ఆస్ట్రేలియా పర్యటనలోనూ మంచి ప్రదర్శన చేయగలిగా. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నాకు అండగా నిలిచాడు. క్రమశిక్షణగా లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయాలని తరచూ చెప్పేవాడు. గతంలో నేను బౌలింగ్ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేవాడ్ని. కానీ ఇప్పుడు రిలాక్స్గా బౌలింగ్ చేస్తున్నా' అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

బౌలింగ్ దాడికే నేతృత్వం
ఆస్ట్రేలియా పర్యటనలో మొహ్మద్ సిరాజ్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన తెలిసిందే. కట్టుదిట్టమైన బంతులు వేసిన సిరాజ్ మొత్తంగా 13 వికెట్లు తీశాడు. రెండు, మూడో మ్యాచులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సలహాలు పొందిన హైదరాబాద్ పేసర్.. నాలుగో టెస్టులో ఏకంగా బౌలింగ్ దాడికే నేతృత్వం వహించాడు. సీనియర్లు గాయాల బారిన పడటంతో శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్, నవదీప్ సైనీకి అండగా నిలిచాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్కు కూడా సిరాజ్ను భారత్ సెలెక్టర్లు ఎంపిక చేశారు.
India vs England: వారికి ఐదు రోజులు.. వీరికి మాత్రం మూడు రోజులే!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications