
ముంబై: రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు త్వరలో భారత్కు రానుంది. టెస్టు సిరీస్లో మొదటి రెండు టెస్టులకు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో జనవరి 27న చెన్నైలో భారత్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు బయో బబుల్లోకి ప్రవేశించనున్నారు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఫిబ్రవరి 5 నుంచి ఆరంభంకానుంది. అయితే తొలి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లకు మూడు రోజుల ట్రైనింగ్ సెషన్ మాత్రమే లభించనుంది.
శ్రీలంకతో టెస్టు సిరీస్ పూర్తయ్యాక ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ జట్టు బుధవారం చెన్నై చేరుకోనుంది. ఫిబ్రవరి 5 నుంచి భారత్తో తొలి టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే లంక నుంచి వచ్చే ఇంగ్లాండ్ ఆటగాళ్లు కచ్చితంగా ఆరు రోజులు క్వారంటైన్లో ఉండాలి. దాంతో తొలి టెస్టుకు ముందు ఆ జట్టుకు మూడు రోజులే ట్రైనింగ్ సెషన్ లభించనుంది. లంకతో టెస్టు సిరీస్ ఆడని బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్ ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఈ ముగ్గురూ ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. దాంతో వీరికి ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ చేసుకునే వీలుంది.
శ్రీలంక గడ్డపై అడుగుపెట్టగానే ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే శ్రీలంక బోర్డు కేవలం 48 గంటలు మాత్రమే ఇంగ్లాండ్ ఆటగాళ్లని క్వారంటైన్లో ఉంచింది. ఆ తర్వాత ట్రైనింగ్కి అనుమతించింది. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం సుదీర్ఘ సిరీస్ కావడంతో.. ఆరు రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఆరు రోజులు మూడు సార్లు ఇంగ్లాండ్ ఆటగాళ్లకి కరోనా పరీక్షల్ని నిర్వహించనున్నారు. టీమిండియా ఆటగాళ్లకు కూడా మూడు సార్లు పరీక్షలు చేస్తారు. మొదటి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదు.
ఈ టెస్టు సిరీస్ భారత్కు చాలా ముఖ్యమైందని చెప్పాలి. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ సిరీస్లో ఆస్ట్రేలియాపై భ్బరాత్ విజయం సాధించి టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇప్పుడు ఇంగ్లాండ్పై కూడా సిరీస్ గెలిస్తే.. ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించే వీలుంది. మరోవైపు భారత్లోనే ఐపీఎల్ 14వ సీజన్ను నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. దాంతో ఇంగ్లాండ్తో మూడు సిరీస్లు నిర్వహించడం కీలకంగా మారింది. ఒకవేళ ఏ ఆటంకాలూ లేకుండా ఇవి విజయవంతమైతే.. ఏప్రిల్, మేలో ఐపీఎల్ జరిగే అవకాశం ఉంది.