
హైదరాబాద్: లాక్డౌన్లో ఒకే స్టంప్ను లక్ష్యంగా పెట్టుకుని బౌలింగ్ ప్రాక్టీస్ చేసానని టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. ఆ కష్టమే ఐపీఎల్ 2020 సీజన్, ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడానికి దోహదపడిందన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు.
'2019 ఐపీఎల్లో రాణించకపోవడం వల్ల ఈ సీజన్ నాకెంతో కీలకమని తెలుసు. అందుకే లాక్డౌన్లో బౌలింగ్ మెరుగుపర్చుకోవడంపై పూర్తిగా దృష్టి సారించా. ఒకే స్టంప్ పెట్టుకుని చాలా ప్రాక్టీస్ చేశా. అందుకే గత సీజన్ ఐపీఎల్తో సహా ఆస్ట్రేలియా పర్యటనలోనూ మంచి ప్రదర్శన చేయగలిగా. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నాకు సాయపడ్డాడు. క్రమశిక్షణగా లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయాలని తరచూ చెప్పేవాడు. గతంలో నేను బౌలింగ్ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేవాడ్ని. కానీ.. ఇప్పుడు రిలాక్స్గా ఏకాగ్రతతో బౌలింగ్ చేస్తున్నా.' అని సిరాజ్ తెలిపాడు.
ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం టెస్టు సిరీస్లోనే సిరాజ్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో క్రమశిక్షణగా బౌలింగ్ చేసిన సిరాజ్ను ఎదుర్కొనేందుకు.. సొంతగడ్డపైనే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఎంతలా అంటే..? సిరీస్లో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. రెండింటిలోనూ ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. మొత్తంగా.. సిరీస్లో మూడు టెస్టులు ఆడిన సిరాజ్ 13 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. గబ్బా వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఐపీఎల్ 2020 సీజన్లో ఒకే మ్యాచ్లో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన మహ్మద్ సిరాజ్.. టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా రికార్డ్ నెలకొల్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే మహ్మద్ సిరాజ్ ఐపీఎల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. భారత్, ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్కు కూడా సిరాజ్ను భారత్ సెలెక్టర్లు ఎంపిక చేశారు.