టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన ఫేవరేట్ సౌతిండియన్ యాక్టర్ అని టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. ప్రభాస్ నటించిన బహుబలి సినిమా తన ఫేవరేట్ మూవీ అని పేర్కొన్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో నిర్వహించిన ఓ చిట్చాట్లో సిరాజ్ ఈ విషయాలను వెల్లడించాడు.
ఈ సెషన్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సిరాజ్ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. అయితే ఫేవరేట్ సౌతిండియాన్ హీరో, మూవీ ఏంటిదని ఓ అభిమాని ప్రశ్నించగా.. సిరాజ్ ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్, 'బాహుబలి' సినిమా అని తెలిపాడు. తనకు బాహుబలి బిగినింగ్ చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.
రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ఫాలోయింగ్ లభించింది.

బాలీవుడ్లో తనకు షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పిన సిరాజ్.. వారి చిత్రాలను ఎక్కువగా చూస్తానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇష్టమైన హీరోయిన్స్ గురించి మాత్రం సిరాజ్ వెల్లడించలేదు. షారుఖ్ ఖాన్ నటించిన 'చక్ దే ఇండియా' సినిమా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. . ఈ సినిమాలోని దేశభక్తి, పోరాటస్ఫూర్తి తనను ప్రభావితం చేశాయని సిరాజ్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో మహమ్మద్ సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో ఐదు మ్యాచ్లు ఆడిన సిరాజ్.. 185.3 ఓవర్లు వేసి 23 వికెట్లతో సత్తా చాటాడు. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఆఖరి పోరులో మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్తో టీమిండియాను గెలిపించాడు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. టీమిండియా గెలుపునకు నాలుగు వికెట్లు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిరాజ్ మూడు వికెట్లు తీసి భారత్కు సంచలన విజయాన్నందించాడు. దాంతో ఐదు టెస్ట్ల సిరీస్ను భారత్ 2-2తో సమం చేసుకుంది.
ఆసియా కప్ 2025కు ఎంపిక చేసిన భారత జట్టులో సిరాజ్కు చోటు దక్కలేదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సిరాజ్.. ఆస్ట్రేలియా-ఏతో లక్నో వేదికగా జరిగే రెండో అనధికారిక టెస్ట్తో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. సెప్టెంబర్ 23 నుంచి 26 మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.