హైదరాబాద్: టీమిండియా పేసర్, హైదరాబాద్ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ అత్యంత ఖరీదైన బీఎమ్డబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని అతనే ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. ఆటో డ్రైవర్ కొడుకుగా తన క్రికెట్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సిరాజ్.. అంచెలంచెలుగా ఎదిగాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో సుదీర్ఘ ఫార్మాట్ను ప్రారంభించిన ఈ హైదరాబాద్ గల్లీ భాయ్.. సూపర్ ఫెర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి భారత్ తరఫున హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు.
ఇక గబ్బా వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో ఐదు వికెట్లతో ఆతిథ్య ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఈ ప్రదర్శనతో సిరాజ్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు ఐపీఎల్లో రాణించినా.. టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లు ఆడినా పెద్దగా పట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు సిరాజ్ జపం చేస్తున్నారు. ఎందుకంటే ఆసీస్ పర్యటనలో ఉండగానే సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ అనారోగ్యంతో మరణించాడు.
తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినా.. దేశం తరఫున ఆడాలనే తన తండ్రి కలను నెరవేర్చేందుకు అక్కడే ఉండిపోయాడు. మానసికంగా ఎంతో బాధను అనభవిస్తూ.. సహచర ఆటగాళ్ల సాయంతో తన తండ్రి కలను నెరవేర్చాడు. వికెట్ తీసిన ప్రతిసారి ఆకాశంవైపు చూస్తూ తన తండ్రికి ఘననివాళులర్పించాడు. అంతేకాకుండా ఆసీస్ ప్రదర్శన తన తండ్రికే అంకితమని కూడా చెప్పాడు.
ఇక ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ మొదలుపెట్టిన సిరాజ్.. అద్భుత ప్రదర్శనతో కీలక ఆటగాడిగా ఎదిగి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొనడాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సూపర్ సిరాజ్ అంటూ కొనియాడుతున్నారు.
Mohammad Siraj buying a Brand New BMW Car. Congratulations to you Siraj. And pray that you get more success in the future. pic.twitter.com/mSUva2AgMP
— CricketMAN2 (@man4_cricket) January 22, 2021