ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ సిరీస్లో ఐదు టెస్ట్లకు ఐదు మ్యాచ్లు ఆడి మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆఖరి టెస్ట్లో 9 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్నైట్ స్కోర్తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి రోజు 35 పరుగులను డిఫెండ్ చేసి చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు సాధించింది.

ఈ సిరీస్లోనే సిరాజ్ 185 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. మరోవైపు వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. దాంతో సిరాజ్ అదనపు భారాన్ని మోసాడు. అయితే సిరాజ్ కూడా గాయంతోనే ఆడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మెట్లు దిగుతున్నప్పుడు సిరాజ్ చీలమండ బెణికినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా వరుసగా ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడటంతో అతని కండరాలు తీవ్ర నొప్పి గురైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నొప్పిని అధిగమించేందుకు సిరాజ్ చీలమండ బ్రేస్లు ధరించి ఆడినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని మోకాలికి రక్తం కారింది. అయినా సిరాజ్ నొప్పిని భరిస్తూనే జట్టులో కొనసాగాడు. తాను కూడా తప్పుకుంటే జట్టు కష్టాల్లో పడుతుందని భావించి, ఈ హైదరాబాద్ పేసర్ రిస్క్ చేసినట్లు తెలుస్తోంది. పైగా టీమిండియాకు ఇప్పట్లో టెస్ట్ సిరీస్లు లేవు. అక్టోబర్లో వెస్టిండీస్తో సొంతగడ్డపై రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది.