కెరీర్ ఆరంభంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన సలహా తనకు బాగా ఉపయోగపడిందని స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. టీమిండియాలోకి ఏంట్రీ ఇచ్చినప్పుడు పెప్ టాక్లో భాగంగా ధోనీ అన్న మాటలు తనపై తీవ్ర ప్రభావం చూపాయన్నాడు. ఇతరుల అటెన్షన్ కోసం చూడవద్దని, బాగా ఆడితే మెచ్చుకున్న వ్యక్తులే.. విఫలమైతే తిట్టని తిట్లు తిడుతారని ధోనీ చెప్పాడని సిరాజ్ పేర్కొన్నాడు.
టెస్ట్ల్లో టీమిండియా ప్రధాన పేసర్గా ఎదిగిన సిరాజ్.. వెస్టిండీస్తో తొలి టెస్ట్లో ఏడు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ పర్యటనలో 23 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ ఆరంభంలో తనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్ను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2018లో ఆర్సీబీ తరఫున విఫలమైనప్పుడు జుగుప్సాకరమైన ట్రోలింగ్ను ఎదుర్కొన్నానని తెలిపాడు. 'మీ అయ్యతో కలిసి ఆటో నడుపుకోవాలని'అని కొందరు విమర్శలు గుప్పించారని గుర్తు చేసుకున్నాడు.

అయితే ఈ విమర్శలకు కుంగిపోకుండా ధోనీ చెప్పిన మాటలు తనకు ఉపయోగపడ్డాయని సిరాజ్ తెలిపాడు. 'నేను టీమిండియాలో చేరిన కొత్తలో నాతో ధోనీ అన్న మాటలు నాకింకా గుర్తుకున్నాయి. బయటి వ్యక్తుల మాటలు పట్టించుకోవద్దని చెప్పారు. మీరు బాగా ఆడుతున్నప్పుడు ప్రపంచం మొత్తం మీతోనే ఉంటుందని, సరిగ్గా ఆడకపోతే మాత్రం పొగిడిన వారే విమర్శలు గుప్పిస్తారని టీమ్ పేప్ టాక్లో ధోనీ భాయ్ చెప్పారు.
ధోనీ చెప్పినట్లుగా ఆ ట్రోలింగ్ దారుణంగా ఉంటుంది. అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడు అభిమానులతో పాటు ప్రపంచం మొత్తం మనతో ఉండి.. 'సిరాజ్ లాంటి బౌలర్ లేడు'అని కొనియాడుతారు. కానీ తర్వాతి మ్యాచ్లో విఫలమైతే మాత్రం 'మీ నాన్నతో వెళ్లి ఆలో నడుపుకో'అంటూరు. దీనర్థం ఒక మ్యాచ్లో హీరో అయితే.. మరొక మ్యాచ్ జీరో(నవ్వుతూ). ప్రజలు అంత త్వరంగా మారిపోతారు. అందుకే బయటి వ్యక్తుల విషయాలు పట్టించుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను. నా గురించి నా సహచరులు, నా కుటుంబం ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. నాకు ముఖ్యమైన వ్యక్తులు వారే. ఇతరుల మాటల గురించి నేను పట్టించుకోను.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.