టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఆడే దేశాల్లో ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ను అధిగమించాడు. వెస్టిండీస్తో అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమైన మ్యాచ్లో సిరాజ్ తొలి స్పెల్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఏడాది సిరాజ్ టెస్ట్ల్లో 7 మ్యాచ్లు ఆడి 31 వికెట్లు పడగొట్టాడు.
సిరాజ్ తర్వాత మిచెల్ స్టార్క్ 7 మ్యాచ్ల్లో 29 వికెట్లు, షమర్ జోసెఫర్ 6 మ్యాచ్ల్లో 24, నాథన్ లయన్ 3 మ్యాచ్ల్లో 22, జోష్ టంగ్ 4 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టారు. డబ్ల్యూటీసీ 2025- 2027 సైకిల్లో సిరాజ్ ఇప్పటికే 27 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్లో సిరాజ్.. ఇప్పటికే రెండు సార్లు నాలుగు వికెట్ల ఘనతలను,రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతలను అందుకున్నాడు.

ఇంగ్లండ్ పర్యటనలో 23 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన సిరాజ్.. అదే జోరును వెస్టిండీస్తో సిరీస్లోనూ కొనసాగిస్తున్నాడు. టాస్ ఓడి బౌలింగ్కు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ఆరంభంలోనే తేజ్నారాయణ్ చందర్పాల్(0)ను డకౌట్గా పెవిలియన్ చేర్చిన సిరాజ్.. స్టన్నింగ్ డెలివరీతో బ్రాండన్ కింగ్(13) క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆచితూచి ఆడిన అలిక్ అథనాసియస్(12)ను క్యాచ్ ఔట్గా వెనక్కిపంపాడు. లంచ్ బ్రేక్ అనంతరం కెప్టెన్ రోస్టన్ ఛేజ్(24)ను పెవిలియన్ చేర్చి నాలుగో వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. సిరాజ్కు తోడుగా బుమ్రా రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టడంతో వెస్టిండీస్ 150 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. జస్టిన్ గ్రీవ్స్(32), షైహోప్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.