ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిరాజ్ విఫలమవ్వడంతో అతనిపై టీమిండియా మేనేజ్మెంట్ వేటు వేసింది. సిరాజ్కు బదులు టీ20 స్పెషలిస్ట్ అయిన అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేశారు.
మిడిల్, డెత్ ఓవర్లలో సిరాజ్ ప్రభావం చూపలేడనే అతన్ని పక్కనపెట్టామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సిరాజ్.. రీఎంట్రీ ఇవ్వడంపై ఫోకస్ పెట్టాడు. ఫిట్నెస్తో పాటు బౌలింగ్ను మెరుగుపర్చుకునేందుకు ట్రైనింగ్ ప్రారంభించాడు. 'రెస్ట్, రీస్టార్ట్, రీ ఫోకస్'అనే క్యాప్షన్తో జిమ్ వర్కౌట్ ఫొటోలను షేర్ చేశాడు.

ఆ తర్వాత హైదరాబాద్ రంజీ టీమ్తో కలిసి ప్రాక్టీస్ చేయడంతో పాటు దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగాడు. విదర్భతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ తరఫున సిరాజ్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి 7 ఓవర్లు మెయిడిన్ చేసి ఓ వికెట్ తీసాడు. ఓ ఎండ్లో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మరో ఎండ్లో హైదరాబాద్ బౌలర్లు వికెట్లు దక్కించుకున్నారు.
రెండో ఇన్నింగ్స్లో 20 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 4 మెయిడిన్లు వేసి 3 వికెట్లు తీసాడు. రెండు ఇన్నింగ్స్ల్లో అతను ఎకానమీ 3 ధాటలేదు. మిడిల్ ఓవర్లలో ప్రభావం చూపలేడన్న రోహిత్ శర్మ వ్యాఖ్యలకు సిరాజ్ తన బౌలింగ్తోనే బదులిచ్చాడు. బ్యాటింగ్ వైఫల్యంతో ఈ మ్యాచ్లో హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఓడినా.. సిరాజ్ మాత్రం అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు తాను సిద్దంగానే ఉన్నానని తన ప్రదర్శనతో తెలిపాడు. అయితే మహమ్మద్ సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే అవకాశాలను కొట్టిపారేయలేమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయంపై క్లారిటీ లేదని, ఒకవేళ అతను జట్టుకు అందుబాటులోకి రాకపోతే సిరాజ్ రీఎంట్రీ ఇస్తాడని చెబుతున్నారు. అదే జరిగితే షమీతో కలిసి సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకుంటాడు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా.. బంగ్లాదేశ్తో 23న భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.