వరుస బంతుల్లో..
ఓవర్నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను రోరీ బర్న్స్ (136 బంతుల్లో 49; 7 ఫోర్లు), డామ్ సిబ్లీ జాగ్రత్తగా ప్రారంభించారు. టీ సమయానికి 14 ఓవర్లలో 23 పరుగులు జత చేశారు. అయితే విరామం తర్వాత హైదరాబాదీ పేసర్ సిరాజ్ చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వరుస బంతుల్లో డొమినిక్ సిబ్లే(44 బంతుల్లో ఫోర్తో 11), హసీబ్ హమీద్(0)లను పెవిలియన్ చేర్చాడు. ఆ ఓవర్లో రెండో బంతిని సిరాజ్ లెగ్ స్టంప్ లైన్ దిశగా వేయగా.. సిబ్లే దాన్ని ప్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా షార్ట్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్నకేఎల్ రాహుల్ చేతుల్లో పడింది.

పాపం హమీద్..
ఆ తర్వాత క్రీజులోకి హమీద్ రాగా.. ఆఫ్ స్టంప్ను లక్ష్యంగా చేసుకుని మహమ్మద్ సిరాజ్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరీని హమీద్ ఫార్వార్డ్ డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఐదేళ్ల తర్వాత టెస్టులు ఆడుతుండటంతో అతను బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో.. బ్యాట్కి దొరకని బంతి నేరుగా వెళ్లి స్టంప్లను గీరాటేసింది. దాంతో ఐదేళ్ల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడిన హమీద్.. సిరాజ్ దెబ్బకి గోల్డన్ డక్గా వెనుదిరిగాడు. 2016 నవంబర్లో తన చివరి టెస్టు ఆడిన హమీద్... 1717 రోజుల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులో స్థానం సంపాదించి తొలి బంతికే క్లీన్బౌల్డ్ అయ్యాడు. దాంతో బ్యాక్ టు బ్యాక్ వికెట్లు దక్కించుకున్న ఈ హైదరాబాదీ పేసర్.. హ్యాట్రిక్ సాధించేలా కనిపించాడు. కానీ.. తర్వాత బంతిని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అత్యంత జాగ్రత్తగా డిఫెన్స్ చేసి అడ్డుకున్నాడు.

ఆదుకున్నరూట్..
ఈ దశలో బర్న్స్, రూట్లపై జట్టును ఆదుకునే భారం పడింది. వీరిద్దరు మూడో వికెట్కు 85 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అయితే క్రీజులో కుదురుకున్న ఈ జోడీని షమీ విడదీశాడు. బర్న్స్ను ఔట్ చేసి ఇంగ్లండ్ను దెబ్బ తీశాడు. మరో వికెట్ పడకుండా జోరూట్ (75 బంతుల్లో 48 బ్యాటింగ్; 6 ఫోర్లు), బెయిర్స్టో (6 బ్యాటింగ్) నిలకడగా ఆడటంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. తన ఓవర్నైట్ స్కోరుకు మరో 2 పరుగులే జోడించిన కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, 1 సిక్స్) టీమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 86 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగడం విశేషం.

పేకమేడలా కూలిన ఇన్నింగ్స్..
తొలి రోజు ప్రదర్శించిన ఆట, చేతిలో ఉన్న వికెట్లను చూస్తే భారత్ స్కోరు కనీసం 500 పరుగుల వరకు చేరగలదనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేశారు. శుక్రవారం తొలి ఓవర్ రెండో బంతికే రాహుల్ను రాబిన్సన్ అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. తన పేలవ ఫామ్ను కొనసాగిస్తూ అజింక్య రహానే (1) తర్వాతి ఓవర్ తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ స్థితిలో రవీంద్ర జడేజా (120 బంతుల్లో 40; 3 ఫోర్లు), రిషభ్ పంత్ (58 బంతుల్లో 37; 5 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్కు 49 పరుగులు జోడించగా... తనదైన శైలిలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన పంత్, పేలవ షాట్ ఆడి నిష్క్రమించాడు. ఆ తర్వాత ముగ్గురు బౌలర్లు షమీ (0), ఇషాంత్ (8), బుమ్రా (0) వికెట్లను తీసేందుకు ఇంగ్లండ్కు ఎంతోసేపు పట్టలేదు.

సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 126.1 ఓవర్లలో 364 ఆలౌట్(కేఎల్ రాహుల్ 129, రోహిత్ శర్మ 83, అండర్సన్ 5/62)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 45 ఓవర్లలో 119/3 ( జో రూట్ (75 బంతుల్లో 48 బ్యాటింగ్), బెయిర్స్టో (6 బ్యాటింగ్), సిరాజ్ 2/34)


Click it and Unblock the Notifications












