ఐపీఎల్ 2025 సీజన్ను టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ పేలవ ప్రదర్శనతో ప్రారంభించాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్.. పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో తేలిపోయాడు. మరోసారి డెత్ ఓవర్లలో తన బలహీనతను బయట పెట్టుకున్నాడు. అతని పేలవ ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో సిరాజ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 54 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి మూడు ఓవర్లలో 31 పరుగులే ఇచ్చిన సిరాజ్.. ఆఖరి ఓవర్లో ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. శశాంక్ సింగ్ ధాటికి సిరాజ్ వరుసగా 4, 2, 4, 4, వైడ్, 4, 4 ఇచ్చాడు. ఈ ఓవరే గుజరాత్ టైటాన్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. సిరాజ్ కట్టడిగా బౌలింగ్ చేసుంటే గుజరాత్ టైటాన్స్ విజయం సాధించేది.

ఈ పేలవ ప్రదర్శనతో సిరాజ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సిరాజ్ డెత్ ఓవర్లలో ప్రభావం చూపలేడని, అందుకే అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అప్పట్లో వివరణ ఇచ్చాడు. ఆ మాటలను సిరాజ్ తాజా ఐపీఎల్ మ్యాచ్లో నిజం చేశాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అతని టీ20 ప్రదర్శన దిగజారిందని కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు ఆర్సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిరాజ్ను వదులుకొని ఆర్సీబీ మంచి పనిచేసిందని పోస్ట్లు పెడుతున్నారు. ఐపీఎల్లో సిరాజ్.. సుదీర్ఘ కాలం ఆర్సీబీకే ఆడాడు. గత సీజన్లో దారుణంగా విఫలమవడంతో ఆర్సీబీ అతన్ని వేలంలోకి వదిలేసింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్తో పాటు ప్రసిధ్ కష్ణ, రబడా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. దాంతో పంజాబ్ చివరి 6 ఓవర్లలో 104 పరుగులు చేసింది. మరోవైపు పంజాబ్ బౌలర్లు మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.