
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్కు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని తట్టుకోలేకపోయిన అక్తర్ ట్విటర్ వేదికగా గుండె పగిలిన ఏమోజీని షేర్ చేశాడు. ఈ ఓటమిని తనను తీవ్రంగా కలచివేసిందని ఏమోజీ రూపంలో వ్యక్త పరిచాడు. ఇక ఈ ట్వీట్ను రీట్వీట్ చేసిన మహమ్మద్ షమీ.. దీన్నే కర్మ అంటారు బ్రదర్ అని పేర్కొన్నాడు. ఇలా అంటున్నందుకు క్షమించాలని కూడా కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
ఇక నెదర్లాండ్స్ పుణ్యమా సెమీఫైనల్కు వచ్చిన పాక్.. న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్ చేరింది. దాంతో ఆ జట్టు టైటిల్ గెలిచినంత హడావుడి చేసింది. ముఖ్యంగా ఆ దేశ ప్రధానితో పాటు మాజీ ఆటగాళ్లు భారత వైఫల్యాన్ని హేళన చేశారు. ముఖ్యంగా టీమిండియా బౌలర్లను చేతకాని వారని విమర్శించారు. అక్తర్ అయితే భారత బౌలింగ్ యూనిట్ను పాకిస్థాన్ బౌలర్లతో పోల్చుతూ విమర్శలు గుప్పించాడు.
'ఇంగ్లండ్కి పాకిస్థాన్ జట్టు గురించి బాగా తెలుసు. టీమిండియాపై గెలిచిన తర్వాత వారి కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది. అయితే పాకిస్తాన్ బౌలర్లు, ఇండియా బౌలర్లలా చేతకాని వారు కాదు. ఈ విషయం ఇంగ్లండ్కి కూడా బాగా తెలుసు. పాక్ బౌలర్లను ఎదుర్కొని , వరల్డ్ కప్ గెలవడం అంత ఈజీ కాదు. పాకిస్థాన్ బౌలర్ల కారణంగానే ఫైనల్ చేరింది'అని చెప్పుకొచ్చాడు.
అక్తరే కాదు చాలా మంది భారత వైఫల్యానికి బౌలింగే కారణమని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలతో బాగా హర్ట్ అయిన మహమ్మద్ షమీ.. అక్తర్కు అదరిపోయే కౌంటరిచ్చాడు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్థాన్తో మ్యాచ్ సమయంలో మహ్మద్ షమీపై తీవ్ర స్థాయిలో సైబర్ దాడి జరిగింది. మహ్మద్ షమీ కావాలనే ఆ మ్యాచ్లో టీమిండియాని ఓడించాడని పోస్టులు చేస్తూ, అతన్ని, తన కుటుంబాన్ని తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే పాక్ నుంచే ఈ ట్రోలింగ్ జరిగిందని, భారతీయుల పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి షమీని టార్గెట్ చేస్తూ దూషించారని నిరూపితమైంది. ఈ క్రమంలోనే షమీ ఇలా అక్తర్కు కౌంటరిచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.