ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్(SRH) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్టార్ పేసర్ మహమ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్కు ఇచ్చింది. ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా ఈ డీల్ పూర్తి చేసింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు ఈ డీల్ పూర్తయిందని మరికొద్ది గంటల్లో అధికార ప్రకటన వస్తుందని జాతీయ మీడియా పేర్కొంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 10 కోట్ల భారీ ధరకు మహమ్మద్ షమీని సన్రైజర్స్ కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. 9 మ్యాచ్లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీసాడు. ఈ పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అతని వైఫల్యం సన్రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను కూడా దెబ్బతీసింది. మొత్తం 14 మ్యాచ్ల్లో 6 గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఓ మ్యాచ్ రద్దవ్వడంతో 13 పాయింట్స్ సొంతం చేసుకొని 6వ స్థానంతో సరిపెట్టుకుంది.

ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలోనే షమీని సన్రైజర్స్ వదిలేస్తుందని ప్రచారం జరిగింది. కానీ లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్ డీల్ రావడంతో మరో ఆలోచన లేకుండా వదిలేసింది. రూ. 10 కోట్ల భారీ ధరకే లక్నో ట్రేడ్ చేసుకుంది. ఇటీవల రంజీ ట్రోఫీలో షమీ సత్తా చాటాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను రెండు మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు ఫిదా అయిన లక్నో అతన్ని భారీ ధరకు ట్రేడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరిగే అవకాశం ఉంది. నవంబర్ 15లోపు రిటెన్షన్ జాబితాలు ప్రకటించేందుకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్లైన్ విధించింది. శనివారం సాయంత్రం అధికార బ్రాడ్కాస్టర్లో పది ఫ్రాంచైజీ రిటెన్షన్, రిలీజ్ జాబితాలు రానున్నాయి.