టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహమ్మద్ షమీ సిద్దమవుతున్నట్లు నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అతను కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని మహమ్మద్ షమీని బీజేపీ పెద్దలు కోరినట్లు సమాచారం. ముస్లింల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ షమీని అస్త్రంగా వాడుకోవాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బెంగాల్లో ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఒకటైన బసీర్హట్ నుంచి షమీని పోటీ చేయించాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
.

అయితే ఈ వార్తలపై మహమ్మద్ షమీ కానీ.. బీజేపీ పార్టీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ షమీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నాడని నేషనల్ మీడియా కోడై కూస్తోంది. చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమైన మహమ్మద్ షమీ ఇటీవలే సర్జరీ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు.
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన షమీ.. 24 వికెట్లు పడగొట్టి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ టోర్నీ తర్వాత షమీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సర్జరీ కారణంగా ఐపీఎల్ 2024 సీజన్కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పి రాజకీయాల్లోకి రావాలని అతని సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రాజకీయాల్లోకి వస్తే ప్రొఫెషనల్ క్రికెట్కు దూరంగా ఉండాలి. దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం ఉన్నా.. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి షమీ ఎన్నికల్లో పోటీ చేయడని అతని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. క్రికెటర్గా సక్సెస్ అయిన షమీ.. ఓ భర్తగా మాత్రం తన కాపురాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
తన మాజీ సతీమణి హసిన్ జహాన్కు షమీ విడాకులు ఇచ్చాడు. ఈ ఇద్దరికి ఓ పాప కూడా జన్మించింది. ప్రస్తుతం ఆ చిన్నారి తల్లివద్దనే ఉంటుంది.