మైదానంలో నమాజ్ చేశానని తనపై విమర్శలు గుప్పించిన నెటిజన్లపై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న అనంతరం తన సెలెబ్రేషన్స్పై అర్థం పర్థం లేని రూమర్స్ క్రియేట్ చేసినవారిపై మహమ్మద్ షమీ మండిపడ్డాడు.
భారత్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్లో మహమ్మద్ షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన విషయం తెలిసిందే. 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టిన షమీ.. మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

అయితే శ్రీలంకతో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న అనంతరం షమీ.. మోకాళ్లపై కూర్చొని రెండు చేతులతో నేలను టచ్ చేశాడు. అయితే ఈ సంబరాలను కొంతమంది అభిమానులు తప్పుబట్టారు. షమీ నమాజ్ చేశాడని ఆరోపిస్తూ అతనిపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఇదే విషయాన్ని మహమ్మద్ షమీ ముందు ప్రస్తావించగా.. కాస్త ఘాటుగా స్పందించాడు.
తాను గర్వించదగిన భారత ముస్లింనని తెలిపాడు. తాను నమాజ్ చేయాలనుకుంటే అడ్డుకునేవాడు ఎవడని ప్రశ్నించాడు. 'నేను నమాజే చేయాలనుకుంటే నన్ను ఎవరు ఆపుతారు? నమాజ్ చేసేటప్పుడు నన్ను ఎవరూ అడ్డుకోరు. నాకు నమాజ్ చేయాలనుకుంటే చేస్తా. ఇందులో ఉన్న సమస్య ఏంటి? నేను గర్వించదగిన ముస్లింనని చెబుతా. ఓ భారతీయుడినని గర్వంగా పేర్కొంటా.
ఇందులో ఉన్న సమస్య ఏంటి? నమాజ్ చేసుకోవడానికి కూడా పర్మీషన్ తీసుకునే పరిస్థితి ఉంటే.. నేను ఈ దేశంలో ఎందుకు ఉంటాను? గతంలో నేను 5 వికెట్లు తీసినప్పుడు నమాజ్ చేశానా? నేను చాలా సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాను. ఇక నేను ఎక్కడ ప్రార్థన చేయాలో చెప్పండి. అక్కడికి వెళ్లి నమాజ్ చేస్తాను.'అని మహమ్మద్ షమీ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
శ్రీలంకతో మ్యాచ్లో తాను నమాజ్ చేయలేదని, వికెట్ల కోసం 200 శాతం ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేయడంతో కాస్త అలసటకు గురై మోకాళ్లపై కూర్చున్నానని వివరణ ఇచ్చాడు.
'ఇలాంటి వ్యక్తులు ఎవరివైపు ఉండరు. కేవలం వివాదాలు సృష్టించాలనుకుంటారు. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్లో నేను 200 శాతం ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేశాను. వికెట్లు కూడా వరుస విరామాల్లో పడ్డాయి. మూడు వికెట్లు తీసిన అనంతరం ఐదు వికెట్ల ఘనతను అందుకోవాలనే ఆలోచన వచ్చింది. అయితే చాలా సేపటి వరకు వికెట్ దక్కలేదు. చాలా బంతులు బ్యాటర్ల ఎడ్జ్ తీసుకున్నాయి. దాంతో కాస్త చికాకుకు గురయ్యాను. చివరికి ఐదో వికెట్ రాగానే మోకాళ్లపై కూలబడ్డాను. కానీ ప్రజలు దీనికి పెడర్దం తీసి వివాదాస్పదం చేశారు. పనిపాట లేని వారే తప్పుడు ఉద్దేశాలతో ఇలా చేశారు.'అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.