ఆస్ట్రేలియా పర్యటనకు తనను పరిగణలోకి తీసుకోకపోవడంపై టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అసహనం వ్యక్తం చేశాడు. తాను ఫిట్గానే ఉన్నానని, బెంగాల్ తరఫున రంజీ క్రికెట్ ఆడేందుకు కూడా సిద్దంగా ఉన్నానని తెలిపాడు. జట్టు ఎంపిక అనేది తన చేతుల్లో లేదని పేర్కొన్నాడు. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా బుధవారం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అవకాశం దక్కగా షమీని ఎంపిక చేయలేదు. దాంతో అతను ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడని అంతా అనుకున్నారు. కానీ తాజాగా మీడియాతో మాట్లాడిన షమీ.. తన ఫిట్నెస్పై క్లారిటీ ఇచ్చాడు.

'జట్టు ఎంపిక నా చేతుల్లో లేని విషయం. గతంలో కూడా నేను ఇదే చెప్పాను. నాకేమైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే బెంగాల్ తరఫున రంజీ క్రికెట్ ఎందుకు ఆడుతాను? టీమ్ సెలెక్షన్ గురించి మాట్లాడి వివాదం సృష్టించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా.
రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు 50 ఓవర్ల క్రికెట్లోనూ బరిలోకి దిగగలను. ఫిట్నెస్ గురించి చెప్పడం.. అడగడం.. సమాచారం ఇవ్వడం నా బాధ్యత కాదు. పనికాదు. ఎన్సీఏకు వెళ్లి సిద్దమవడం.. మ్యాచ్లాడటమే నా పని. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ రెగ్యులర్గా ఆడుతున్నా. అయినా సెలెక్టర్లు పట్టించుకోలేదు. దానికి నేనేం చేయలేను. ఆడటమే నా పని'అని షమీ చెప్పుకొచ్చాడు.
నేటి(బుధవారం)అక్టోబర్ 15 నుంచి రంజీ ట్రోఫీ 2025-26 ప్రారంభం కానుంది. ఉత్తరాఖండ్తో బెంగాల్ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. నేడే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత వన్డే జట్టు:
శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
వన్డే షెడ్యూల్..
తొలి వన్డే: అక్టోబర్ 19(ఆదివారం),పెర్త్, ఉదయం 9 గంటలకు
రెండో వన్డే: అక్టోబర్ 23(గురువారం), అడిలైడ్, ఉదయం 9 గంటలకు
మూడో వన్డే: అక్టోబర్ 25(శనివారం), సిడ్నీ , ఉదయం 9 గంటలకు