టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన రీఎంట్రీ మ్యాచ్లో దుమ్మురేపుతున్నాడు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న రౌండ్ 5 మ్యాచ్లో బెంగల్ తరఫున బరిలోకి దిగిన షమీ.. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. చీలమండ గాయంతో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న షమీ.. రీఎంట్రీలో తన ఫస్ట్ మ్యాచ్లోనే సత్తా చాటాడు.
తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లతో చెలరేగిన లాలాజీ.. రెండో ఇన్నింగ్స్లో బ్యాట్తో మెరిసాడు. టెయిలెండర్గా 10వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన షమీ.. 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 37 పరుగులు చేశాడు. తమ్ముడు మహమ్మద్ కైఫ్(6 నాటౌట్)తో కలిసి ఆఖరి వికెట్ 39 పరుగులు జోడించాడు. 103 స్ట్రైక్రేట్ బ్యాటింగ్ చేసిన షమీ రెండు భారీ సిక్స్లు కొట్టాడు.

షమీ సూపర్ బ్యాటింగ్తో బెంగాల్ రెండో ఇన్నింగ్స్లో 276 పరుగులు చేసింది. దాంతో మధ్యప్రదేశ్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. లక్ష్యచేధనకు దిగిన మధ్యప్రదేశ్ నిలకడగా ఆడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఇంకా 188 పరుగులు కావాలి. బెంగాల్ విజయం సాధించాలంటే మరో 7 వికెట్లు తీయాలి.
క్రీజులో రజత్ పటీదార్(32 బ్యాటింగ్)తో పాటు శుభమ్ శర్మ(18 బ్యాటింగ్) ఉన్నారు. బెంగల్ బౌలర్లలో షమీ, రోహిత్ కుమార్, షెహ్బాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు. భారత జట్టు తరఫున వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా బరిలోకి దిగిన షమీ.. చీల మండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. విదేశాల్లో శస్త్రచికిత్స్ చేయించుకున్న షమీ పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు చాలా సమయం తీసుకున్నాడు.
ఇటీవలే బెంగళూరులోని ఎన్సీఏలో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకున్న షమీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నదమవుతున్నాడు. రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడి తన సత్తా నిరూపించుకొని భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తానని తెలిపాడు. షమీ మునపటిలా సత్తా చాటుతుండటంతో అతను ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండో టెస్ట్లోపు షమీని భారత జట్టులోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తెరలేవనుంది.