తన తుది శ్వాస వరకు టీమిండియాకు ఆడాలనుందని స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. దేశం తరఫున ఆడాలన్న తపన ఉన్నంత కాలం.. ఎన్నిసార్లు గాయపడ్డా ఆటగాడు పుంజుకుంటాడని తెలిపాడు. చీల మండ, మొకాలి గాయాలతో 14 నెలల పాటు భారత జట్టుకు దూరంగా ఉన్న మహహ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు. బుధవారం కోల్కతా వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్తోనే షమీ మళ్లీ టీమిండియా జెర్సీ ధరించనున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపికైన షమీకి ఇంగ్లండ్తో టీ20 సిరీస్ లిట్మస్ టెస్ట్ లాంటిది.

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న షమీ.. తన పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'దేశం తరఫున ఆడాలన్న కసి ఎప్పుడూ పోవద్దు. దేశానికి ఆడాలనే తపన ఉంటే ఏ ఆటగాడై పోరాడుతాడు. ఎన్నిసార్లు గాయపడ్డా.. కోలుకుంటాడు. ఎన్ని మ్యాచ్లు ఆడినా నాకు తక్కువే అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కసారి క్రికెట్కు దూరమైతే మళ్లీ ఎప్పటికీ నాకు అవకాశం రాకపోవచ్చు. నా చివరి శ్వాస వరకు టీమిండియాకు ఆడాలనుకుంటున్నా.'అని షమీ చెప్పుకొచ్చాడు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ షమీ పునరాగమనంపై సంతోషం వ్యక్తం చేశాడు. మహమ్మద్ షమీ రీఎంట్రీతో టీమిండియా బలం పెరిగిందని, ఛాంపియన్స్ ట్రోఫీలో తిరుగుండదని గుంగూలీ అభిప్రాయపడ్డాడు. 'షమీ రీఎంట్రీ ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అతను జస్ప్రీత్ బుమ్రా తర్వాత అతనే అత్యుత్తమ భారత బౌలర్. షమి కాస్త భయాందోళనలో ఉండవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ కాలం తర్వాత మోకాలి నుంచి కోలుకొని క్రికెట్ ఆడుతున్నాడు. కానీ, దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరఫున ఆడటం అతనికి కలిసొచ్చే అంశం.
ఈ అనుభవం అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఉపయోగపడనుంది. షమీ ఎంట్రీతో బుమ్రాపై వర్క్లోడ్ తగ్గనుంది. బుమ్రా ఒక ఎండ్ నుంచి.. షమీ మరో ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే జట్టుకు కలిసొస్తుంది. పరస్పర సహకారంతోనే ఇద్దరు టెస్ట్ క్రికెట్లో సక్సెస్ అయ్యారు.'అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.