
లీడ్స్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో తమ జట్టు పేలవ ప్రదర్శన ఎలాంటి దిగులు లేదని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. టెస్ట్ ఫార్మాట్లో ఇలాంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయని, ప్రతీ టీమ్కు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని చెప్పాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయని, ఒక్క ఇన్నింగ్స్ పేలవ ప్రదర్శన తమను మానసికంగా దెబ్బ తీయదని స్పష్టం చేశాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్లో 78 పరుగులకు ఆలౌటవ్వడం.. ఆ తర్వాత బౌలింగ్లో తేలిపోయి ఆతిథ్య జట్టుకు భారీ స్కోర్ చేసేలా చేయడం ఆటగాళ్ల మానసిక స్థితిని దెబ్బతీస్తుందా? అన్న ప్రశ్నకు షమీ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.
'లేదు, మిత్రమా! ప్రస్తుత ప్రదర్శన మాపై మానసికంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదు. మేం మూడు రోజుల్లో మ్యాచులు ముగించాం. కొన్ని సార్లైతే రెండు రోజుల్లోనే ముగించేశాం. కొన్నిసార్లు చెడ్డ రోజులు ఎదురవుతాయి. టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సుల్లో త్వరగా ఆలౌటై ఎక్కువసేపు ఫీల్డింగ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అంత మాత్రానికే ఆత్మస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా సిరీసులో రెండు టెస్టులు మిగిలే ఉన్నాయి.
మేం సిరీసులో 1-0తో ఆధిక్యంలో ఉన్నాం. అందుకే ప్రతికూలంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మా నైపుణ్యాలను విశ్వసించి, మాకు మేం అండగా ఉండాలి. ప్రత్యర్థి జట్టులో భారీ భాగస్వామ్యాలు నమోదవుతుంటే వాటిని విడదీయాల్సిన బాధ్యత బౌలర్ల మీదే ఉంటుంది. వికెట్లు తీసేందుకు, బ్యాట్స్మెన్ను బురిడీ కొట్టించేందుకు మనసులోనే వ్యూహాలు రచించాల్సి ఉంటుంది.' అని షమీ చెప్పుకొచ్చాడు.
తొలి ఇన్నింగ్స్లో చెత్త బ్యాటింగ్తో టీమిండియా 78 పరుగులకే కుప్పకూలగా.. ఇంగ్లండ్ మాత్రం దుమ్ము రేపింది. వాళ్ల ఆటతీరు బంతి నుంచి బ్యాట్కు బదిలీ అయింది తప్ప ఆడిన తీరు, క్రీజులో జోరు ఏమాత్రం తగ్గలేదు. పరుగుల హోరు ఆగలేదు. బ్యాటింగ్ వరుసలో టాపార్డర్ 'టాప్' ప్రదర్శన చేసింది. కెప్టెన్ జో రూట్ (165 బంతుల్లో 14 ఫోర్లతో 121) మరో శతకంతో చెలరేగగా, డేవిడ్ మలాన్ (128 బంతుల్లో 11 ఫోర్లతో 70) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 129 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో నిలవగా, ఓవర్టన్ (24 బ్యాటింగ్), రాబిన్సన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు.