కోల్కతా: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసిన్ జహాన్ పోలీసుల నిర్లక్ష్యంపై కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయోధ్యలో రామ మందిర భూమి పూజ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా హిందువులకు శుభాకాంక్షలు తెలిపిన హసిన్ జహాన్పై కొందరు ఆకతాయిలు తీవ్ర ట్రోలింగ్కు పాల్పడ్డారు. రేప్ చేసి చంపేస్తామని బెదరింపులకు దిగారు. అసభ్యకర పదజాలంతో త్రీవ్రంగా దూషించారు.
ఈ ట్రోలింగ్ నేపథ్యంలో హసీన్ జహాన్ కోల్కతా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. అసభ్య పదజాలంతో ట్రోలింగ్ పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆగస్టు 9న ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అప్పటి నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయని హై కోర్టులో పిల్ దాఖలు చేసింది. తన కూతురు, తనకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ పిటిషన్ను స్వీకరించిన కోల్కతా హైకోర్టు వచ్చేవారం విచారించనుంది.
ఆగష్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణ భూమి పూజ శాస్త్రోక్తంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హసీన్ జహాన్ సంతోషం వ్యక్తం చేస్తూ.. 'రామ మందిర పూజ సందర్భంగా హిందువులందరికీ శుభాకాంక్షలు'అంటూ ట్వీట్ చేశారు. దీంతో ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది ఆమెపై విరుచుకుపడ్డారు. అత్యాచారం చేసి, చంపేస్తామంటూ అసభ్యకర రీతిలో కామెంట్లు చేస్తూ బెదిరింపులకు దిగారు. ముస్లింవై ఇలా ట్వీట్ చేయడం సమంజసం కాదన్నారు.
ఇక మహ్మద్ షమీ తనను హింసిస్తున్నాడని, అతనికి అనేక మంది అమ్మాయిలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టారు. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్కతా పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు విడిగా ఉంటున్నారు. హసీన్ జహాన్ మోడల్గా కెరీర్ కొనసాగిస్తుంది. అయితే ఆమె ట్రోలింగ్ గురికావడం ఇదే తొలిసారి కాదు. షమీపై ఆరోపణలు చేసినప్పటి నుంచి.. ఆమెపై తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. జహాన్ కూడా నెటిజన్లను రెచ్చగొట్టేలా హాట్ ఫొటో షూట్, వీడియోలను షేర్ చేస్తుంది.