Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వన్డే ప్రపంచకప్ 2023లో సంచలన ప్రదర్శన కనబర్చాడు. ఆడింది ఏడు మ్యాచ్లే అయినా 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా.. అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న క్రికెటర్గా చరిత్రకెక్కాడు.
అయితే ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ షమీ.. ఆ రాష్ట్రం తరఫున దేశవాళీ క్రికెట్ ఆడకుండా బెంగాల్ తరఫున డొమెస్టిక్ కెరీర్ ప్రారంభించాడు. బెంగాల్ జట్టు తరఫున దేశవాళీలో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. యూపీ తరఫున ఆడకుండా బెంగాల్కు ఎందుకు ప్రాతినిథ్యం వహించారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహమ్మద్ షమీని ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానమిచ్చాడు.

యూపీ క్రికెట్ బోర్డులో ఉన్న రాజకీయాల వల్లే తాను బెంగాల్ జట్టు తరఫున ఆడాల్సి వచ్చిందని మహమ్మద్ షమీ తెలిపాడు. నాణ్యమైన ప్రదర్శన ఇచ్చినా సరే రెండేళ్ల పాటు జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టేశారని.. దాంతో వేరే రాష్ట్రానికి మారిపోవాల్సి వచ్చిందన్నాడు.
'నా సొంత రాష్ట్రం యూపీ నుంచి కాకుండా బెంగాల్ నుంచి దేశవాళీ క్రికెట్ ఆడా. నా సెలెక్షన్ గురించి అప్పటి యూపీ చీఫ్ సెలెక్టర్ ఇచ్చిన సమాధానంతోనే నేను బెంగాల్కు మారాల్సి వచ్చింది. నా సెలెక్షన్ గురించి మా అన్నయ్య చీఫ్ సెలెక్టర్ను కలిశాడు. కానీ అతను మాత్రం తాను ఈ పదవిలో ఉన్నంత వరకు సెలెక్ట్ చేయనని చెప్పాడు. దాంతో మా అన్నయ్య దిగ్భ్రాంతికి గురయ్యాడు.
'నీ పదవి కోల్పోయేలా చేసే పవర్ నాకుంది. కానీ చేయను. ఆటగాళ్ల సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేయాలి'అని మా అన్నయ్య సదరు సెలెక్టర్కు సమాధానం ఇచ్చాడు. దాంతో నేను కోల్కతా వచ్చేసాను. 14 ఏళ్ల వయసులోనే బెంగాల్ క్రికెట్లో భాగమయ్యాను.'అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.
వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు షమీ చెప్పుకొచ్చాడు. కుటుంబ సభ్యులతో అండతో ఆ సమస్యల నుంచి గట్టెక్కానని తెలిపాడు. రోడ్డు ప్రమాదం అయిన తర్వాత మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని భావించానని, అలానే మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించానని చెప్పుకొచ్చాడు.