
న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఇంగ్లండ్తో మూడో టెస్ట్కు సిద్దం అవుతున్నాడు. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సఏ)లోని నెట్స్లో శనివారం అతను బౌలింగ్ చేశాడు. అయితే పూర్తి స్థాయి రనప్తో కాకుండా తక్కువు స్థాయి ఇంటెన్సిటీతో బంతులు వేశాడు. వచ్చే వారానికి అతని విషయంలో స్పష్టత వస్తుందని ఎన్సీఏకు చెందిన ఓ అధికారి తెలిపారు.
'మహ్మద్ షమీ మణికట్టు ప్రస్తుతం బాగానే ఉంది. కొద్ది రోజుల తేలికపాటి నెట్ సెషన్స్లో పాల్గొంటాడు. 50 నుంచి 60 శాతం శ్రమ పెట్టి రోజుకు 18 డెలివరీస్ వెయ్యమని అతనికి సూచించారు. దాదాపు 45 రోజులుగా ఆటకు దూరంగా ఉండటంతో నెమ్మదిగా వర్క్లోడ్ను పెంచుతారు. ఇంగ్లండ్తో పింక్ బాల్ టెస్ట్కు ఇంకా రెండున్నర వారాల టైముంది. ఈ లోపు ఫిట్నెస్ సాధించి షమీ సెలెక్షన్కు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి.
బౌలింగ్ వేయగలగుతున్నాడంటేనే అతని చేయి బాగా ఉందని అర్థం. షమీకి వేరే సమస్యలేవి లేవు. అందువల్ల వచ్చే వారానికే అతని విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తోంది.'అని ఎన్సీఏకు చెందిన సదరు అధికారి మీడియాకు తెలిపారు. ఇక, ఎన్సీఏలో శనివారం జరిగిన సెషన్లో షమీతో పాటు సైనీ కూడా పాల్గొన్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో షమీ గాయపడిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తుండగా.. ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అతడి మణికట్టు దెబ్బతిని సిరీస్ నుంచే వైదొలగాల్సి వచ్చింది. చెన్నైలో ఫిబ్రవరి 13 నుంచి జరిగే రెండో టెస్టు సందర్భంగా చివరి రెండు టెస్టులకు తుది జట్టును ప్రకటించనున్నారు.