
కోల్కతా: కరోనా కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడటమో.. రద్దవ్వడమో జరుగుతున్నాయి. ఇక మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రీల్ 15కు వాయిదా పడింది. ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితులతో ఈ క్యాష్ రిచ్ లీగ్ జరగడం సందేహంగా మారింది.
మరోవైపు కరోనా కట్టడికి భారత ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించింది. ఇది ఇంకా పొడిగించే అవకాశం ఉంది. దీంతో భారత స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.
కొందరు ఫిట్నెస్ కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు. అయితే స్పీడ్స్టర్ మహ్మద్ షమీ తనలో కొత్త కోణాన్ని అభిమానులకు పరిచయం చేశాడు. మైదానంలో తన పేస్తో బ్యాట్స్మెన్ వెన్నులో వణుకు పుట్టించే షమీ.. తన చేతిలో అందమైన బొమ్మలు కూడా గీయగలనని నిరూపించాడు. అమ్రోహలోని తన ఇంట్లో గురువారం గీసిన ఓ బొమ్మను షమీ.. ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. 'కొన్నేండ్ల తర్వాత మళ్లీ స్కెచ్ పట్టాను. ఆర్టిస్టుగా షమీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ' అని పోస్ట్ చేశాడు.
మరోవైపు స్వీయ నిర్బంధంలో గడుపుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతని భార్య అనుష్క శర్మ హెయిర్ కట్ చేస్తే.. కొడుకుతో శిఖర్ ధవన్ సరదాగా గడుపుతున్నాడు. వీటికి సంబంధించిన వీడియోలను ఈ స్టార్ ప్లేయర్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక రోహిత్ మాత్రం ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ ఫ్యాన్స్ కావాల్సిన మజా ఇస్తున్నాడు. ఇక యువీతో రోహిత్ క్విజ్ సెషన్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ క్విజ్లో రోహిత్ తన కెరీర్కు సంబంధించిన విషయాలు చెప్పలేక తడబడ్డాడు. చివరకు తన ఎత్తు ఎంతో చెప్పలేకపోయాడు.