టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి బిగ్ షాక్ తగిలింది. భారత జట్టులోకి అతని రీఎంట్రీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగిన మహమ్మద్ షమీ.. చీల మండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు.
ఆ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దాంతో గతేడాదిగా ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ ప్రారంభించిన మహమ్మద్ షమీ.. న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ లేదా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ ఈ రెండు సిరీస్లకు అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.

ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మహమ్మద్ షమీ రిహాబిలిటేషన్ పూర్తి చేసుకొని ఫిట్నెస్ టెస్ట్ కూడా పాసయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చే ముందు దేశవాళీ క్రికెట్ ఆడుతానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడి సత్తా చాటి.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతానని చెప్పాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని కూడా స్పష్టం చేశాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు. బెంగాల్ తరఫున షమీ.. రంజీ ట్రోఫీ ఆడుతాడని అంతా భావించారు. కానీ తదుపరి రెండు రౌండ్ల రంజీ మ్యాచ్లకు సంబంధించి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం ప్రకటించిన రంజీ జట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు.
కర్ణాటకతో నవంబర్ 6 నుంచి బెంగాల్ నాలుగో రౌండ్ రంజీ మ్యాచ్ ఆడనుండగా.. నవంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే ఐదో రౌండ్లో మధ్యప్రదేశ్తో తలపడనుంది. రంజీ ట్రోఫీ తొలి దశ టోర్నీకి ఇదే చివరి రౌండ్. రెండో ఫేజ్లో మిగతా లీగ్ మ్యాచ్లతో పాటు నాకౌట్ మ్యాచ్లు జరగనున్నాయి. సెకండ్ ఫేజ్ రంజీ ట్రోఫీకి ముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీలు జరగనున్నాయి.
భారత్-ఏ జట్టుతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన అభిషేక్ పోరెల్, ముఖేష్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్లకు బెంగాల్ రంజీ టీమ్కు దూరమయ్యారు. రంజీ ట్రోఫీకి మహమ్మద్ షమీ ఎంపిక కాకపోవడంతో అతని రీఎంట్రీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఆడవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.