పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజాపై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సక్సెస్ను ఓర్వలేక కించపరిచే వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డాడు. పసలేని ఆరోపణలతో యావత్ క్రికెట్ ప్రపంచం ముందు నవ్వులపాలయ్యాడని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ అసాధారణ ప్రదర్శనపై హసన్ రాజా సంచలన ఆరోపణలు చేశాడు.
మెగా టోర్నీలో భారత ఆటగాళ్లకు భిన్నమైన బంతులు ఇస్తున్నారని, దాంతోనే వారు సత్తా చాటుతున్నారని ఆరోపించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సిరాజ్, మహమ్మద్ షమీ బౌలింగ్ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహమ్మద్ షమీ ఘాటుగా స్పందించాడు.

అవి అసూయతో మాట్లాడిన మాటలని, హసన్ రాజా వంటి పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు క్రికెట్ను జోక్గా మార్చారని మండిపడ్డాడు. 'వాళ్లు క్రికెట్ను ఓ జోక్గా మార్చారు. ఇతరుల విజయాలను వాళ్లు ఆనందించలేరు. వారిని ప్రశంసిస్తే సంతోషిస్తారు. కానీ ఓడిపోయినప్పుడు ప్రత్యర్థులు మోసం చేశారని ఆరోపిస్తారు. జట్టుగా మేం సాధించిన విజయాలు, రికార్డులను చూడండి. ఇలాంటి అసూయతో ఎవరూ మెరుగైన ఫలితాలు సాధించలేరు.'అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.
ఇక వరల్డ్ కప్లో భారత ఆటగాళ్లకు ప్రత్యేకమైన బంతులు ఇచ్చారని, వాటితో వాళ్లు స్వింగ్, రివర్స్ స్వింగ్ సునాయసంగా రాబట్టి అనుకూల ఫలితాలు సాధిస్తున్నారని అప్పట్లో హసన్ రాజా ఆరోపించాడు.
ఇక చీలమండ గాయంతో జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ.. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత అతను ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకు కూడా షమీ దూరంగా ఉండనున్నాడు. అతను నేరుగా ఐపీఎల్ 2024లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వన్డే ప్రపంచకప్లో మహమ్మద్ షమీ సంచలన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే.
ఓవైపు గాయంతో బాధపడుతూనే ఇంజెక్షన్స్ తీసుకొని బరిలోకి దిగాడు. అసాధారణ ప్రదర్శనతో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు.