షమీ.. పాకిస్థాన్ వెళ్లిపోవాలంటూ..
అయితే ఓటమిని జీర్ణించుకోలేని కొందరు భారత ఆటగాళ్లపై ట్రోలింగ్కు దిగారు. ముఖ్యంగా మహమ్మద్ షమీని టార్గెట్ చేస్తూ మతం పేరిట జుగుప్సాకరమైన కామెంట్స్ చేశారు. మ్యాచ్ ఓడిన వెంటనే షమీ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు. హద్దులు ధాటి మరీ షమీని పాకిస్థాన్ వెళ్లిపోవాలని సూచించారు. బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాడని, షమీ పాక్కు అమ్ముడుపోయాడనే జుగుప్సాకరమైన కామెంట్లు చేశారు. ఓటమిని ఏ మాత్రం సహించలేని ఓ వర్గం అభిమానులు.. ఆ కోపాన్ని షమీపై తీశారు. ఓటమి బాధను వ్యక్తపరచడం కంటే ముస్లిం సమాజంపై వారికున్న దుర్బుద్దిని చాటుకున్నారు. అయితే ఈ ట్రోలింగ్ను తిప్పికొడుతు మహమ్మద్ షమీకి అభిమానులు, మాజీ క్రికెటర్లు అండగా నిలుస్తున్నారు.
ఈ చెత్తను ఆపండి..
సోషల్ మీడియా వేదికగా మహమ్మద్ షమీపై జరుగుతున్న దాడి షాక్కు గురిచేసిందని, అతనికి మేం అండగా నిలుస్తున్నామని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. షమీ ఓ చాంపియన్ అని, ఇండియా క్యాప్ ధరించిన ప్రతీ ఒక్కరు దేశం కోసమే ఆడుతారని, ఈ ఆన్లైన్ మూకల కంటే వారికే ఎక్కువ దేశభక్తి ఉంటుందని సెహ్వాగ్ చురకలంటించాడు. ఇలాంటి ట్రోలింగ్కు బెదిరిపోవద్దని, తామంతా ఉన్నామని షమీకి ధైర్యం చెప్పాడు. ఇక మాజీ ఆల్రౌండర్ ఇర్పాన్ పఠాన్ సైతం ఈ ట్రోలింగ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఆడే రోజుల్లో కూడా పాకిస్థాన్ చేతిలో ఓడిపోయామని, కానీ ఈ తరహా ట్రోలింగ్ ఎదుర్కొలేదన్నాడు. గత కొన్నేళ్లుగానే ఈ చెత్త మొదలైందని, దీన్ని ఆపాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశాడు.
#istandwithshami ట్రెండింగ్..
మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా మహమ్మద్ షమీకి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే #istandwithshami హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో నిలిచింది. ఇలాంటి ట్రోలింగ్ షమీని ఏం చేయలేవని, ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే 11 మంది ఆటగాళ్లలో షమీని మాత్రమే టార్గెట్ చేయడం బాలేదని, ఇది ఓ వివక్ష అని, ముస్లిం సమాజం పట్ల చూపిస్తున్న విద్వేశమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యారని, మ్యాచ్ ఓటమికి కూడా కారణమైంది వాళ్లేనని కానీ షమీని టార్గెట్ చేయడం ఏం బాలేదని మండిపడుతున్నారు.
కనీసం పోరాటం లేకుండా..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడగా...'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' షాహిన్ అఫ్రిది (3/31) దెబ్బ తీశాడు. అనంతరం పాక్ 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా జట్టును గెలిపించారు.


Click it and Unblock the Notifications
