టీమిండియా మాజీ పేసర్ మహమ్మద్ షమీ భారత రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు నామినేట్ అయ్యాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ షమీకి అర్జున అవార్డు ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు బీసీసీఐ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
ఈ అవార్డుకు మహమ్మద్ షమీ పూర్తి స్థాయి అర్హుడని క్రీడా మంత్రిత్వశాఖకు బీసీసీఐ సమర్పించిన ప్రత్యేక అభ్యర్థనలో పేర్కొన్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అయితే అర్జున అవార్డుకు షమీని నామినేట్ చేసినట్లు అటు బీసీసీఐ కానీ.. ఇటు భారత క్రీడా మంత్రిత్వశాఖ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

గతంలో అర్జున అవార్డును శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అందుకున్నారు. 2013లో కోహ్లీకి ఈ అవార్డు వరించగా.. 2015లో రోహిత్ శర్మ, 2014లో రవిచంద్రన్ అశ్విన్, 2019లో రవీంద్ర జడేజా, 2021లో శిఖర్ ధావన్లు ఈ అవార్డ్ స్వీకరించారు.
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో మహమ్మద్ షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్లు ఆడిన షమీ 24 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్న అతను.. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే.. సౌతాఫ్రికాతో ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్ల సిరీస్లో పాల్గొంటాడు.
ఈ ఏడాది ప్రదానం చేసే క్రీడా అవార్డులకు 12 మంది సభ్యులతో కూడిన స్పోర్ట్స్ మినిస్టర్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేయనుంది. దేశ అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుతో పాటు అర్జున అవార్డ్లతో పాటు ఇతర పురస్కారాలను ఈ ఏడాది ఆగస్టులో ఇవ్వనున్నారు.
క్రీడా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కమిటీకి సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టీస్ ఏఎమ్ ఖాన్విల్కర్ నేతృత్తం వహిస్తున్నారు. ఈ కమిటీలో ఆరుగురు మాజీ అథ్లెట్లు ఉన్నారు. హాకీ ప్లేయర్ ధన్రాజ్ పిల్లే, మాజీ ప్యాడ్లెర్ కమలేష్ మెహ్తా, మాజీ బాక్సర్ అఖిల్ కుమార్, నేషనల్ కోచ్ షుమా షిరూర్, మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా, బ్యాడ్మింటన్ ప్లేయర్ త్రీప్తీ ముర్గుందేలు ఈ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు.