Mohammed Shami: ప్రపంచకప్ 2023లో టీమిండియా బౌలింగ్ను ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ ప్లేయర్ హసన్ రజా చేసిన వ్యాఖ్యలపై మహమ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హసన్ రజా వ్యాఖ్యలు విని తాను ఆశ్చర్యపోయానని తెలిపాడు. అసలు అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడాడా? అనే సందేహం కలిగిందన్నాడు. అతని మాటలు చూసి జనాలు నవ్వుకుంటారని తెలిపాడు. ప్రపంచకప్లో తన సంచలన ప్రదర్శనను చూసి పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు ఓర్వలేకపోతున్నారని తెలిపాడు.
ప్రపంచకప్లో భారత్ విభిన్నమైన బంతులను ఉపయోగిస్తుందని హసన్ రజా ఆరోపించాడు. ఆ బంతులు బౌలింగ్కు అనుకూలంగా ఉంటున్నాయని, దాంతో భారత పేసర్లు చెలరేగుతున్నారని తెలిపాడు. ఈ కామెంట్స్పై తాజాగా స్పందించిన మహమ్మద్ షమీ ఘాటుగా బదులిచ్చాడు.

'నేను ప్రపంచకప్లో ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఈ ఆరోపణలు విన్నాను. నా తొలి మ్యాచ్లో 5 వికెట్లు తీసాను. తర్వాతి మ్యాచ్లో నాలుగు, ఆ తర్వాతి మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టాను. కొందరు పాక్ మాజీ ఆటగాళ్లు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి నేనేం చెయ్యగలను. సరైన సమయంలో రాణించే ఆటగాల్లే అత్యుత్తమమని నేను భావిస్తున్నా.
కానీ, మీరు వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. బంతి వేరే రంగులో కనిపిస్తోంది. వేరే కంపెనీ బంతులను వాడుతున్నారు. ఐసీసీ మీకు వేరే సెట్ బంతులను అందించిందని అంటున్నారు. మీ ఆలోచనలు సరిదిద్దుకోండి. ఓ ఇంటర్వ్యూలో వసీమ్ భాయ్ దీని గురించి వివరించినా.. పాక్ మాజీ ఆటగాళ్లు ఇలానే మాట్లాడుతున్నారు. ఓ మాజీ ఆటగాడు ఇలా మాట్లాడితే జనాలు నవ్వుకుంటారు.'అని షమీ చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్ 2023లో షమీ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అతను ఏడు మ్యాచ్ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ఏకంగా (7/57) గణాంకాలు నమోదు చేసి వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల ఘనతను అందుకున్న ప్లేయర్గా నిలిచాడు.