తరుచూ ఆరోపణలు గుప్పిస్తున్న తన మాజీ సతీమణి హసీన్ జహాన్ గురించి మాట్లాడేందుకు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ నిరాకరించాడు. ఈ విషయాన్ని వదిలేయాలని, తన వైవాహిక జీవితంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంలో తనతో సహా ఎవర్ని నిందించాలనుకోవడం లేదన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా క్రికెట్పై మాత్రమే ఉందని, అనవసర వివాదాల జోలికి పోదల్చుకోవడం లేదని స్పష్టం చేశాడు.
ఛీర్ గర్ల్ అయిన హసీన్ జహాన్ను మహమ్మద్ షమీ 2014లో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జోడీ పెద్దల అంగీకారంతో ఒక్కటైంది. 2015లో కూతురు ఐరా పుట్టింది. నాలుగేళ్ల పాటు సజావుగా సాగిన వీరి సంసారం ఆ తర్వాత కోర్టెక్కింది. 2018లో షమీపై తీవ్ర ఆరోపణలు చేసిన హసీన్ జహాన్ గృహ హింస కేసు పెట్టింది. ఆ తర్వాత కోర్టు సమక్షంలో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి షమీపై సంచలన ఆరోపణలు చేస్తోంది.

షమీ స్త్రీలోలుడని, ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా అతను ఏజ్ ఫ్రాడ్కు పాల్పడ్డాడని, ఫిక్సింగ్ కూడా చేశాడని పేర్కొంది. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ.. అతనికి క్లీన్ ఛీట్ ఇచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా హసీన్ జహాన్ తరుచూ షమీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. తమ కూతురు ఐరాను షమీ పట్టించుకోవడం లేదని, తన ఉంపుడుగత్తెలకు మాత్రం లక్షలు తగలేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం ఐరా తల్లి సంరక్షణలోనే పెరుగుతుంది. మాజీ భార్య, కుమార్తె సంరక్షణ కోసం భరణం కింద ప్రతీ నెల రూ. 4 లక్షలు ఇవ్వాలని కోల్కతా హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రూ. 1.5 లక్షలు భార్య హసీన్ జహాన్ కోసం, రూ. 2.5 లక్షలు కుమార్తె కోసం వెచ్చించేందుకు చెల్లించాలని పేర్కొంది. అయినా కూడా షమీపై హసీన్ జహాన్ నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమీని.. హసీన్ జహాన్ను పెళ్లి చేసుకున్నందుకు ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా అని హోస్ట్ అడిగాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు షమీ నిరాకరించాడు. తన పెళ్లి గురించి వదిలేయాలని రిక్వెస్ట్ చేశాడు. శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్ విడాకుల గల కారణాల గురించి ప్రశ్నించగా షమీ సీరియస్ అయ్యాడు. 'ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. నన్నెందుకు లాగుతున్నావు? ఆ విషయాలు నాకు అనవసరం. నేను క్రికెట్పై మాత్రమే ఫోకస్ పెడుతాను.'అని షమీ స్పష్టం చేశాడు.