టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై తన మాజీ సతీమణి హసీన్ జహాన్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఉంపుడు గత్తెలకు లక్షల్లో ఖర్చు చేసే షమీ.. తమ కుమార్తె ఐరాను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడింది. ఐరాను మంచి స్కూల్లో చేర్పించేందుకు షమీ సహకరించడం లేదని తెలిపింది. షమీ నుంచి విడాకులు తీసుకున్న హసీన్ జహాన్ విడిగా ఉంటుంది.
ఈ ఇద్దరూ 2014లో ప్రేమ వివాహం చేసుకోగా.. 2015లో ఐరా పుట్టింది. నాలుగేళ్ల పాటు సజావుగా సాగిన వీరి సంసారం ఆ తర్వాత కోర్టెక్కింది. 2018లో షమీపై తీవ్ర ఆరోపణలు చేసిన హసీన్ జహాన్ గృహ హింస కేసు పెట్టింది. ఆ తర్వాత కోర్టు సమక్షంలో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఐరా తల్లి సంరక్షణలోనే పెరుగుతుంది. మాజీ భార్య, కుమార్తె సంరక్షణ కోసం భరణం కింద ప్రతీ నెల రూ. 4 లక్షలు ఇవ్వాలని కోల్కతా హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రూ. 1.5 లక్షలు భార్య హసీన్ జహాన్ కోసం, రూ. 2.5 లక్షలు కుమార్తె కోసం వెచ్చించేందుకు చెల్లించాలని పేర్కొంది. అయినా కూడా షమీపై హసీన్ జహాన్ నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది.

తాజాగా ఓ ఛానెల్తో మాట్లాడిన ఆమె షమీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. 'ఐరాను మంచి స్కూల్లో చదివించడం షమీకి ఇష్టం లేదు. కన్న కూతురి కంటే తన గర్ల్ఫ్రెండ్స్ పిల్లలకు షమీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. వారికి ఖరీదైన బహుమతుల్ని ఇచ్చాడు. ఐరాను మాత్రం పూర్తిగా విస్మరించాడు. కనీసం స్కూల్ చదువుకు కూడా డబ్బలు చెల్లించడం లేదు. ఐరా తండ్రి బిలియనీర్ అయినప్పటికీ ఉంపుడగత్తెల పిల్లలు మంచి స్కూల్స్లో చదివేందుకు సహకరిస్తున్నాడు. కూతురి చదువుకు మాత్రం డబ్బులేదని చెబుతున్నాడు. కొందరికి బిజినెస్ క్లాస్ విమానాల్లో ప్రయాణానికి రూ. లక్షలు ఖర్చు చేస్తాడు. గానీ తన కూతురికి ఖర్చు చేసేందుకు వెనుకాడుతాడు.'అని హసీన్ జహాన్ మండిపడింది.