రాంగ్ టైమ్లో తాను ఔటవ్వడంతోనే ఓటమిపాలయ్యామని పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ అన్నాడు. తాను కాసేపు బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు సన్నాహకంగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో పాకిస్థాన్ తేలిపోయింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసి విజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(76 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46), సల్మాన్ అఘా(65 బంతుల్లో ఫోర్, సిక్స్తో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ ఓ రూర్కీ(4/43) నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. మైకేల్ బ్రేస్వెల్(2/38), మిచెల్ సాంట్నర్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. జాకోబ్ డఫ్ఫీ, నాథన్ స్మిత్ తలో వికెట్ తీసారు.

అనంతరం న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసి గెలుపొందింది. డారిల్ మిచెల్(58 బంతుల్లో 6 ఫోర్లతో 57), టామ్ లాథమ్(64 బంతుల్లో 5 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా.. డెవాన్ కాన్వే(74 బంతుల్లో 5 ఫోర్లతో 48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా రెండు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, అబ్రర్ అహ్మద్, సల్మాన్ అఘా తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రిజ్వాన్.. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్ తమ ఓటమిని శాసించిందని చెప్పాడు. మెగా టోర్నీకి ముందు తమ జట్టు ఫీల్డింగ్ మెరుగవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. 'పిచ్ బ్యాటింగ్కు కష్టంగా మారుతుందని భావించే ముందుగా బ్యాటింగ్ చేశాం. కానీ న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత నేను, సల్మాన్ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాం.
260 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయాలనుకున్నాం. కానీ రాంగ్ టైమ్లో నేను ఔటయ్యాను. మా ఫీల్డింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మేం మెరుగవ్వాల్సిన ఏకైక విభాగం ఫీల్డింగే. అబ్రర్ అద్భుతంగా రాణించాడు. మిగతవారు కూడా అతనిలా రాణించాలి. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఒత్తిడిని అధిగమించాలి.'అని మహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.