ఆసియా కప్ 2025 టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా మేనేజ్మెంట్కు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక సలహా ఇచ్చాడు. సంజూ శాంసన్ను మూడో స్థానంలో ఆడించాలని సూచించాడు. వరల్డ్ నెంబర్ 2 బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ ఉన్నప్పటికీ సంజూ శాంసన్ బెస్ట్ ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు. ఇన్నాళ్లు ఓపెనర్గా ఆడిన సంజూ శాంసన్కు శుభ్మన్ గిల్ రీఎంట్రీతో తుది జట్టులో చోటుపై సందేహం నెలకొంది. మరోవైపు కేరళ ప్రీమియర్ లీగ్లో సంజూ శాంసన్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. సంజూ శాంసన్ను మూడో స్థానంలో ఆడించడమే ఉత్తమమని చెప్పాడు.
'అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఆసియా కప్ 2025లో ఓపెనింగ్ చేయాలి. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు యువ ప్లేయర్ తిలక్ వర్మ కొంతకాలం వేచి చూడాలి. ఫస్ట్ డౌన్లో సంజూ శాంసన్ను ఆడించడమే ఉత్తమం. అతని అనుభవం ఇన్నింగ్స్ నిర్మాణంలో అక్కరకొస్తుంది. ఐపీఎల్లోనూ సంజూ శాంసన్ వన్డౌన్లో ఆడుతున్నాడు. ప్రపంచకప్ కూడా ఎంతో దూరం లేదు. 6 నెలల్లోనే రానుంది. ఇప్పట్నంచే జట్టును సన్నద్ధం చేయాల్సి ఉంది. ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టగలిగే టాప్ 10 బ్యాటర్లలో సంజూ ఉంటాడు.

రషీద్ ఖాన్ వంటి మిస్టరీ స్పిన్నర్ను ఎదుర్కోవాలంటే సంజూ శాంసన్ తుది జట్టులో ఉండటం కీలకం. ఆసియా కప్ 2025కు ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసనే సీనియర్. 2015లో అరంగేట్రం చేసిన అతను గత టీ20 ప్రపంచకప్లోనూ సభ్యుడుగా కొనసాగాడు. అతనికి ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకొనేందుకు సిద్ధంగా ఉంటాడు. తాజాగా కేరళ క్రికెట్లోనూ చెలరేగుతున్నాడు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు. సంజూ తరహాలోనే ఫస్ట్ డౌన్లో తిలక్ వర్మ కూడా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మరి టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.