టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మరోసారి విమర్శలు గుప్పించాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఏ ప్రాతిపదికన భారత జట్టును ఎంపిక చేశారో తనకు అర్థం కావడం లేదన్నాడు. జట్టులో ఆంధ్ర ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటని ప్రశ్నించాడు. అతను అసలు ఆల్రౌండరే కాదని స్పష్టం చేశాడు. నితీష్ కుమార్ రెడ్డిని పార్ట్టైమ్ బౌలర్ అనాలని సూచించాడు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భారత్ ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్ ఓడిన సంగతి తెలిసిందే. దాంతో ఆదివారం జరిగే మూడో వన్డే సిరీస్ డిసైడర్గా మారింది. భారత బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నా.. బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. మూడో వన్డే నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన మహమ్మద్ కైఫ్ భారత జట్టు ఎంపిక తీరును తప్పుబట్టాడు.

'న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టు నాకు అస్సలు అర్థం కావడం లేదు. పిచ్ స్లోగా ఉన్న రాజ్కోట్లో నలుగురు పేసర్లతో బరిలోకి దిగారు. కానీ న్యూజిలాండ్ మాత్రం ముగ్గురు స్పిన్నర్లతోనే ఆడింది. న్యూజిలాండ్ ఇక్కడి పరిస్థితులను బాగా అర్థం చేసుకుంది. స్పిన్ వారికి బలం కాకపోయినప్పటికీ, వారు పిచ్ను బాగా అంచనా వేశారు. అసలు భారత తుది జట్టు ఎంపిక నాకు అర్థం కాలేదు.
అలాగే జట్టులో నితీష్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటో కూడా అర్థం కావడం లేదు. హెడ్ కోచ్, మేనేజ్మెంట్ అతని పాత్ర ఏంటో తెలియజేయాలి. నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ కాదు. అతను కేవలం బ్యాటర్ మాత్రమే. ఈ విషయాన్ని భారత జట్టు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వారికి అంత ప్రయోజనం ఉంటుంది. నితీష్ను ఆడిస్తున్నప్పుడల్లా కెప్టెన్ ఇబ్బంది పడుతున్నాడు. అతను ఆల్రౌండర్ అని చెప్పడం సరికాదు. అతను జట్టులో ఉంటాడు కానీ బౌలింగ్ చేయడు. అతను భారత్కు ఆరో బౌలింగ్ ఆప్షన్ కాదు. నిజానికి అతను పార్ట్టైమ్ బౌలర్ మాత్రమే. ఏదో వేయాలి కాబట్టి బౌలింగ్ చేస్తాడు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
వికెట్ టేకర్ అయిన అర్ష్దీప్ సింగ్ను తొలి రెండు వన్డేల్లో ఎందుకు ఆడించలేదని కైఫ్ ప్రశ్నించాడు. 'వికెట్ టేకర్ అయిన అర్ష్దీప్ సింగ్ను కాదని ప్రసిధ్ కృష్ణను ఆడిస్తున్నారు. ఒకటి, రెండు మ్యాచ్ల్లో తప్పా అతను పెద్దగా రాణించిందేం లేదు. ఒకటి, రెండు వికెట్లు తీసినా.. ధారళంగా పరుగులిస్తాడు.
280 రన్స్ తక్కువ కాబట్టే టీమిండియా రెండో వన్డేలో విజయం సాధించలేకపోయిందని ఎవరైనా అంటే.. నేను భారత్ వరల్డ్ కప్ గెలవలేదని చెబుతాను. 270-280 పరుగులు చేసి కూడా మ్యాచ్లు ఎలా గెలవాలో టీమిండియా నేర్చుకోవాలి. డ్యూతో సంబంధం లేకుంగా గెలవడం అలవాటు చేసుకోవాలి. డ్యూ పరిస్థితుల్లో కూడా బౌలింగ్ చేయడం నేర్చుకోవాలి.'అని కైఫ్ సూచించాడు.