టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సూర్యను పందితో పోల్చుతూ అభ్యంతకరంగా మాట్లాడాడు. ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ను టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని తట్టుకోలేకపోయిన మహమ్మద్ యూసుఫ్ పాకిస్థాన్కు చెందిన టీవీ ఛానెల్లో సూర్యను పదే పదే పంది అని పిలుస్తూ ఎటకారం చేశాడు.
పాకిస్థాన్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని ఆ దేశ మాజీ ఆటగాళ్లే విమర్శలు గుప్పించారు. కానీ మహమ్మద్ యూసుఫ్ మాత్రం సూర్యపై నోరు పారేసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా సూర్యకుమార్ యాదవ్ పేరును తప్పుగా పలుకుతూ.. పంది అనే అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. టీవీ యాంకర్ మహమ్మద్ యూసుఫ్ వ్యాఖ్యలను సరిచేసినా.. అలా అనకూడదంటూ అభ్యంతరం చెప్పినా వినిపించుకోలేదు.

భారత కెప్టెన్ను యూసుఫ్ పదే పదే పంది అని పిలవడంతో డిబెట్కు హాజరైన మిగతావారు నవ్వుకున్నారు. అంపైర్ల సాయంతో భారత్ విజయం సాధించిందని కూడా మహమ్మద్ యూసుఫ్ ఆరోపించాడు. భారత బ్యాటింగ్ సమయంలో ఔటిచ్చేందుకు అంపైర్లు వెనుకాడరని, పాక్ బ్యాటింగ్ సమయంలో మాత్రం పదే పదే ఔటిచ్చారని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మహమ్మద్ యూసుఫ్పై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విమర్శలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మహమ్మద్ యూసుఫ్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. షాహిద్ అఫ్రిదిని ఇర్ఫాన్ పఠాన్ కుక్కతో పోల్చినప్పుడు భారత మీడియా, నెటిజన్లు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించాడు. 'దేశం తరఫున ఆడుతూ.. ఆప్యాయత, హుందాతనాన్ని చూపించే ఏ ఆటగాడి పట్ల నేను అగౌరవంగా మాట్లాడలేదు. కానీ షాహిత్ అఫ్రిది కుక్కలా మొరుగుతున్నాడని ఇర్ఫాన్ పఠాన్ అన్నప్పుడు భారతీయ మీడియా, ప్రజలు ఎందుకు అతన్ని ప్రశంసించారు? గౌరవం, మర్యాద గురించి మాట్లాడే ప్రతీ ఒక్కరూ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలను ఖండించాలి కదా..?'అని ఎక్స్వేదికగా రాసుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులే చేయగా.. భారత్ 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా మారింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదమే తీవ్ర చర్చనీయాంశమైంది. భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనుదిరగడాన్ని తప్పుబడుతూ పాకిస్థాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.