పాకిస్థాన్ అండర్ 19 బౌలర్ మొహమ్మద్ సయ్యమ్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత బ్యాటర్ వేదాంత్ త్రివేది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అతని బౌలింగ్లో భారీ సిక్సర్ బాదాడనే కోపంతో బంతిని వేదాంత్ త్రివేదిపైకి విసిరికొట్టాడు.
ఈ అనూహ్య ఘటనతో వేదాంత్ త్రివేది తీవ్ర ఆగ్రహానికి గురైనా.. సీరియస్ లుక్తో సరిపెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. పాక్ బౌలర్ తీరుపై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాడికి అంత బలుపు ఎందుకని కామెంట్ చేస్తున్నారు.
మొహమ్మద్ సయ్యమ్ వేసిన 12వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని సయ్యమ్ నోబాల్గా వేసాడు. దాంతో భారత్కు ఫ్రీహిట్ లభించింది. ఈ అవకాశాన్ని వేదాంత్ సిక్సర్గా మలిచాడు. సయ్యమ్ వేసిన షార్ట్ బాల్ను పుల్ షాట్తో డీప్ మిడ్వికెట్ దిశగా సిక్సర్ తరలించాడు. అతని షాట్ ధాటికి బంతి మైదానం బయట పడింది.
ఈ భారీ సిక్సర్కు పాక్ ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు, ప్రేక్షకులు నోరెళ్ల బెట్టారు. సయ్యమ్ మాత్రం కోపంతో ఊగిపోయాడు. మరుసటి బంతిని వేదాంత్ డిఫెండ్ చేయగా.. ఫాలోత్రూలో అందుకొని అతనివైపు విసిరేసాడు. క్రీజులో ఉన్న తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగానే బంతిని స్టంప్స్ మీదకు విసిరేసాడు. ఆగ్రహానికి గురైన వేదాంత్.. కంటిచూపులతోనే సయ్యమ్ను హెచ్చరించాడు.

47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టుకు ఈ ఫ్రీ హిట్ సిక్సర్ ఊపును అందించింది. ముఖ్యంగా వేదాంత్పై ఉన్న ఒత్తిడిని తగ్గించింది. దాంతో బ్యాటింగ్కు కష్టంగా ఉన్న వికెట్పై వేదాంత్ త్రివేది(98 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 68) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. విహాన్ మల్హోత్ర(21) నాలుగో వికెట్కు 62 పరుగులు జోడించిన వేదాంత్.. అభిజ్ఞాన్ కుండు(16) ఐదో వికెట్కు 38 పరుగులు, అంబ్రిష్తో కలిసి ఆరో వికెట్కు 35 పరుగులు జోడించాడు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 58 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఉస్మాన్ ఖాన్(92 బంతుల్లో 7 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. హంజా జహూర్(49 బంతుల్లో 8 ఫోర్లతో 42), ఫర్హాన్ యూసఫ్(39 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్(3/35), ఆయుష్ మాత్రే(3/21) మూడు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. అంబ్రిష్, హెనిల్ పటేల్, కాన్షిక్ చౌహన్, విహాన్ మల్హోత్ర తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో భారత్ ఫైనల్ చేరగా.. పాకిస్థాన్ ఇంటిబాట పట్టింది.