పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్థాన్ తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్గా నిలిచాడు. ఆసియా కప్ 2025 టోర్నీకి సన్నాహకంగా యూఏఈ వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో నవాజ్ ఈ ఫీట్ సాధించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మహమ్మద్ నవాజ్(5/19) ఐదు వికెట్ల ప్రదర్శనతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించాడు.
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో చివరి రెండు బంతులకు అఫ్గాన్ బ్యాటర్లు దార్విష్ రసూలీ(0), అజ్మతుల్లా ఒమర్జాయ్(0)లను పెవిలియన్ చేర్చిన మహమ్మద్ నవాజ్.. తన మరుసటి ఓవర్ తొలి బంతికి ఇబ్రహీం జడ్రాన్(9)ను స్టంపౌట్గా పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. మహమ్మద్ నవాజ్ కంటే ముందు ఫహీమ్ అష్రాఫ్, మహమ్మద్ హస్నైన్లు పాక్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ సాధించారు. కానీ ఈ ఇద్దరూ పేసర్లే కావడం గమనార్హం. ఓవరాల్గా టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన 74వ బౌలర్గా మహమ్మద్ నవాజ్ నిలిచాడు.

మహమ్మద్ నవాజ్(5/19) అసాధారణ ప్రదర్శనతో ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 75 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఫకార్ జమాన్(27), సల్మాన్ అఘా(24), మహమ్మద్ నవాజ్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాణ్(3/38) మూడు వికెట్లు తీయగా.. ఫజలక్ ఫరూఖీ(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్(2/17) రెండు వికెట్లు తీసాడు.
అనంతరం అఫ్గాన్ 66 పరుగులకే కుప్పకూలింది. సెదిఖుల్లా అటల్(13), రషీద్ ఖాన్(17) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్కు తోడుగా అబ్రర్ అహ్మద్(2/17), సుఫియన్ ముఖీమ్(2/9) రెండేసి వికెట్లు తీసారు. ఈ గెలుపుతో ట్రై సిరీస్ను పాక్ సొంతం చేసుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ నవాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఆసియా కప్ 2025 ముందు దక్కిన ఈ విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది.