టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతని కెప్టెన్సీ బాలేదని, తీవ్రంగా నిరాశపర్చిందన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వైఫల్యంతో పాటు వర్షం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లేకుండానే టీమిండియాకు బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ మ్యాచ్ గురించిన మాట్లాడిన కైఫ్.. పార్ట్టైమ్ బౌలర్లతో విజయాలు సాధించలేమని అభిప్రాయపడ్డాడు. వికెట్ టేకింగ్ బౌలర్ అయిన కుల్దీప్ యాదవ్ను తుది జట్టులో ఆడించాలని సూచించాడు.

'ఆస్ట్రేలియా పర్యటన భారత బౌలర్లతో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్ సామర్థ్యానికి కూడా పరీక్ష. తుది జట్టులో కుల్దీప్ యాదవ్కు చోటు కల్పించలేదు. అన్ని విభాగాలను కవర్ చేశారు. కానీ వికెట్ టేకింగ్ బౌలర్ను జట్టులోకి తీసుకోలేదు. కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడం నిరాశకు గురి చేసింది. ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ కూడా రెండు వికెట్లు తీసాడు. క్వాంటిటీ కోసం క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారు.
ప్రస్తుతం జట్టులో చాలా మంది పార్ట్ టైమ్ బౌలర్లు ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయి బౌలర్ కాదు. పెర్త్ వికెట్పై వాషింగ్టన్ సుందర్ కూడా పూర్తి స్థాయి బౌలర్ కాదు. బౌలర్గా హర్షిత్ రాణా తీవ్రంగా నిరాశపర్చాడు. స్వల్ప లక్ష్యమే అయినా మ్యాచ్ను గెలిపించే బాధ్యతను బౌలర్లు తీసుకోవాలి. కనీసం గెలుపు కోసం ప్రయత్నించాలి. కేవలం బుమ్రా, షమీ ఉన్నప్పుడే గెలుస్తామంటే ఎలా?'మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ మూడు ఫార్మాట్లలో సత్తా చాటాడనే విషయాన్ని మరిచిపోవద్దని కైఫ్ గుర్తు చేశాడు. ఆసీస్ వికెట్లు స్పిన్కు అనుకూలంగా ఉండవని చెప్పడం సరికాదన్నాడు.
కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో 17 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. న్యూజిలాండ్తో రెండు టెస్ట్ల సిరీస్లో 12 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్ట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అంతేకాకుండా ఆసీస్ గడ్డపై కుల్దీప్కు మెరుగైన రికార్డ్ ఉంది. ఇక్కడ 23 మ్యాచ్లు ఆడి 31 వికెట్లు పడగొట్టాడు. కానీ ఎక్స్ట్రా బ్యాటర్ కోసం టీమిండియా.. కుల్దీప్ యాదవ్ను పక్కనపెడుతుంది.