భారత సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి అనాలోచిత నిర్ణయాల కారణంగా టీమిండియాకు తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ గత శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టులో సెలెక్టర్లు మూడు మార్పులు చేశారు. టీ20 ఫార్మాట్లో వరుసగా విఫలమైన శుభ్మన్ గిల్పై వేటు పడింది. వికెట్ కీపర్ జితేష్ శర్మను తప్పించిన సెలెక్టర్లు ..సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇషాన్ కిషన్తో పాటు రింకూ సింగ్ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు.అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్సీ దక్కింది. మిగతా టీ20 ప్లేయర్లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
ఆసియా కప్ టోర్నీతో శుభ్మన్ గిల్ భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతని కోసం బాగా ఆడుతున్న సంజూ-అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీని డిస్టర్బ్ చేశారు. కానీ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని తప్పించి మళ్లీ సంజూ శాంసన్నే ఓపెనర్గా ఆడించారు.

భారత జట్టులో తరుచూ మార్పులు చేయడాన్ని కైఫ్ తప్పుబట్టాడు. ఇది టీమ్ టీ20 ప్రపంచకప్ సన్నాహకాలను దెబ్బతీసిందన్నాడు. టీ20 ఫార్మాట్లో శుభ్మన్ గిల్ కంటే మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లు ఉన్నారని సెలెక్టర్లకు తెలిసి కూడా అతనికి అవకాశం ఇచ్చారని మండిపడ్డాడు. శుభ్మన్ గిల్కు అవకాశం ఇవ్వడం వల్ల యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మకు తగిన అవకాశాలు ఇవ్వలేకపోయారని అసహనం వ్యక్తం చేశాడు.
'టీ20 ఫార్మాట్లో శుభ్మన్ గిల్ కంటే మెరుగైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారని సెలెక్టర్లకు తెలుసు. ఈ ఒక్క ఫార్మాట్లోనే శుభ్మన్ గిల్ కంటే మెరుగైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ సెలెక్టర్లు ఇది తెలిసి కూడా తప్పు చేశారు. వారి తప్పిదం వల్ల భారత క్రికెట్ వెనక్కి వెళ్లిపోయింది. వారి అనాలోచిత నిర్ణయాల కారణంగా గత రెండు, మూడు నెలలుగా జైస్వాల్, శాంసన్, జితేష్ శర్మలకు తగిన అవకాశాలు ఇవ్వలేకపోయారు. వారికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. అంతే కాకుండా అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి గిల్ అప్పగించారు. తిరిగి మళ్లీ అతనికే వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. ఈ నిర్ణయం కారణంగా అక్షర్ పటేల్ కెప్టెన్సీ స్కిల్స్ మెరుగుపర్చుకునే కీలక సమయాన్ని వృథా చేశారు.'అని మహమ్మద్ కైఫ్ మండిపడ్డారు.