ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వ్యవహరించిన తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ కోసం ఆర్టీఎమ్ కార్డ్ ఉపయోగించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు.
గత సీజన్లో ఆర్సీబీకి అద్భుత విజయాలు అందించిన విల్ జాక్స్ను ఆ జట్టు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. అతన్ని వదిలేయడం బుద్ది తక్కువ నిర్ణయమని విమర్శించాడు. సోమవారం ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన విల్ జాక్స్ను ముంబై ఇండియన్స్ రూ. 5.20 కోట్లకు దక్కించుకుంది.

ఆర్సీబీకి అంబానీ థ్యాంక్స్..
ఈ ఆటగాడి కోసం ముంబై.. పంజాబ్ కింగ్స్తో తీవ్రంగా పోటీపడింది. చివరకు రూ. 5.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్సీబీకి ఆర్టీఎమ్ కార్డ్ ఉపయోగించుకునే అవకాశం ఉన్నా.. ఆ జట్టు వాడుకోలేదు. అది అందర్నీ షాక్కు గురి చేసింది. ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ సైతం అవాక్కయ్యాడు. ఆర్సీబీ టేబుల్ దగ్గరకు వెళ్లి ఆ జట్టు ఓనర్కు ధన్యవాదాలు తెలిపాడు.
విల్జాక్స్ను కొనుగోలు చేయకపోవడంపై కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మెగా వేలంలో ఆర్సీబీ అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందన్నాడు. 'గతేడాది విల్ జాక్స్ ఆర్సీబీ గౌరవాన్ని కాపాడాడు. అతని వల్లే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది. అతను ఆడిన రెండు మ్యాచ్లు నాకు గుర్తున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్పై తన బౌలింగ్తో విజయాన్నందించాడు. గుజరాత్ టైటాన్స్పై 40 బంతుల్లోనే సెంచరీ బాది గెలిపించాడు. ఒంటి చేత్తో రెండు మ్యాచ్లు గెలిపించిన అతన్ని ఆ జట్టు తీసుకోలేదు.
ఆర్సీబీ ప్లాన్ పరమ చెత్త..
ఈ వేలం ద్వారా ఆర్సీబీ మంచి ఆటగాళ్లు మాకు వద్దని చెప్పింది. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్తో పాటు విల్ జాక్స్ను ఆ జట్టు వదిలేసింది. సెంచరీ చేయడం ఏ బ్యాటర్కైనా అంత సులువు కాదు. వేలంలో ఆర్సీబీ వ్యవహరించిన తీరు చూసి ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తొలి రోజు వేలంలో ఆ జట్టు ప్లాన్ చెత్తగా ఉంటే.. రెండో రోజు పరమ చెత్తగా ఉంది. విల్ జాక్స్ను మిస్ చేసుకోవడం ఆ జట్టుకు తీరని నష్టం'అని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో విల్ జాక్స్ 8 మ్యాచ్లు ఆడి 175 స్ట్రైక్రేట్తో 230 పరుగులు చేశాడు. ఒక సెంచరీ కూడా కొట్టాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ జట్టు అతన్ని తీసుకునేందుకు ప్రయత్నించలేదు. అతనికి బదులు టీమ్ డేవిడ్ను కొనుగోలు చేసింది.
ఆర్సీబీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
లియామ్ లివింగ్ స్టోన్(రూ. 8.75 కోట్లు), ఫిల్ సాల్ట్(రూ. 11.50 కోట్లు), జితేశ్ శర్మ(రూ. 11 కోట్లు), జోష్ హజెల్ వుడ్(రూ. 12.50 కోట్లు), రసిక్ ధార్(రూ. 6 కోట్లు), సుయాశ్ శర్మ(రూ. 2.6 కోట్లు), కృనాల్ పాండ్యా(రూ. 5.75 కోట్లు), భువనేశ్వర్ కుమార్(రూ. 10.75 కోట్లు), స్వప్నిల్ సింగ్(రూ. 50 లక్షలు), టీమ్ డేవిడ్(రూ. 3 కోట్లు), రోమారియో షెఫర్డ్(రూ. 1.5 కోట్లు), నువాన్ తుషారా(రూ. 1.6 కోట్లు), మనోజ్(రూ. 30 లక్షలు), జాకోబ్ బెతెల్(రూ. 2.6 కోట్లు), దేవదత్ పడిక్కల్(రూ. 2 కోట్లు), స్వస్తిక్ చికార(రూ. 30 లక్షలు), లుంగి ఎంగిడి(రూ. కోటి), అభినందన్ సింగ్(రూ. 30 లక్షలు), మోహిత్ రతీ(రూ. 30 లక్షలు).