రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడని, అతన్ని ఆపడం ఎవరి తరం కాదన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) శనివారం కీలక మ్యాచ్ ఆడనుంది.
ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఆర్సీబీ కీలకం. ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన మహమ్మద్ కైఫ్... ఈ మ్యాచ్లో కోహ్లీని ఏ బౌలర్ కూడా ఇబ్బంది పెట్టలేడని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ ధ్యానం చేసే సన్యాసి జోన్లో ఉన్నాడని చెప్పాడు.

'ఒక సన్యాసి హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేస్తున్నప్పుడు ఓ ప్రత్యేకమైన జోన్లో ఉంటాడు. ఏదీ కూడా ఆ సన్యాసి దృష్టిని మరల్చదు. పెద్ద శబ్ధం వచ్చినా, ఎవరైనా కేకలు వేసినా, ఏడ్చినా కూడా డిస్టర్బ్ అవ్వడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా ఓ బ్యాటర్గా అదే జోన్కు చేరుకున్నాడు. అతన్ని ఆపడం ఏ బౌలర్ వల్ల కాదు.
స్కోర్ బోర్డ్ను చూడకుండా కోహ్లీ తన జోన్లో ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్ అయినా, స్పిన్నర్ అయినా తన ముందు ఎలాంటి బౌలర్ అయినా అతన్ని ఇబ్బంది పెట్టలేరు. వారిని ఎలా ఆడాలో కోహ్లీకి బాగా తెలుసు. ఏ బౌలర్ వచ్చినా, అతన్ని ఔట్ చేయలేని జోన్కు చేరుకున్నాడు.
అతను ఈ సీజన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించేందుకు చెన్నైలో అడుగుపెట్టాడు. తన జట్టును గెలిపించాలనే కసితో బరిలోకి దిగాడు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్ నుంచే కోహ్లీ కసిని చూడవచ్చు. తొలి మ్యాచ్లో ముస్తాఫిజుర్ బౌలింగ్లో అతను క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. పంజాబ్తో జరిగిన రెండో మ్యాచ్ నుంచే కోహ్లీ పట్టుదలతో కనిపించాడు.
ఆ మ్యాచ్లో కగిసో రబడాపై అతను కొట్టిన సిక్సర్, స్పిన్నర్లపై ఆడుతున్న స్లాగ్ స్వీప్లు అద్భుతం. బ్యాటర్ల గురించి అందరూ నాలుగో, ఐదో గేర్ గురించి మాట్లాడుతారు. కానీ కోహ్లీ 15వ గేర్లో ఆడుతున్నాడు. అతని స్థాయిని మరెవరూ అందుకోలేరు.'అని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.