టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా పనికిరాడని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. అది అతనిపై అనవసర ఒత్తిడిని పెంచుతుందని అభిప్రాయపడ్డాడు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్లో ఒకరికి టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. ఇటీవల ముగిసిన ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
9 ఇన్నింగ్స్ల్లో 39 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్గానూ ఆకట్టుకున్నాడు. మరోవైపు ఈ పర్యటనలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్ల్లో 31 పరుగులే చేశాడు. ఆఖరి టెస్ట్కు తానంతట తానే తుది జట్టు నుంచి తప్పుకున్నాడు.

ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్ శర్మ అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరా? అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రానే రోహిత్ శర్మ వారసుడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బుమ్రాకు ఆ సామర్థ్యం ఉందని, పూర్తి స్థాయి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే మహమ్మద్ కైఫ్ మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాడు.
'రోహిత్ శర్మ తర్వాత జస్ప్రీత్ బుమ్రాను టెస్ట్ కెప్టెన్గా నియమించడం సరైన ఆలోచన కాదు. ఎందుకంటే జట్టు కోసం ఒంటరి పోరాటం చేసిన ఏకైక బౌలర్ బుమ్రా. ఇతర బౌలర్ల నుంచి సహకారం లేకుండా ఎంతో ఒత్తిడిని భరించి జట్టుకు వికెట్లు అందించాడు. వర్క్లోడ్ ఎక్కువ అవ్వడంతో అతను వెన్ను గాయానికి గురయ్యాడు.
బుమ్రా గాయపడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అతను గాయపడ్డాడు. ఫిట్నెస్ సమస్యలు వస్తాయనే అతను కెప్టెన్ కావద్దని బలంగా కోరుకుంటున్నా. నా అభిప్రాయం ప్రకారం బ్యాటర్లు అయిన రిషభ్ పంత్, కేఎల్ రాహుల్లో ఒకరిని సారథిగా నియమించాలి. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్కు ఐపీఎల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. ఈ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్గా ఎంపిక చేస్తే బాగుంటుంది.'అని మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.