
న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గురించి మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలోనే అయ్యర్ బ్యాటింగ్లోనూ టెక్నిక్ లేదని, కానీ పరుగులు చేసే సత్తా ఉందని తెలిపాడు. బంగ్లాదేశ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ తీరును విశ్లేషించిన మహమ్మద్ కైఫ్.. తొలి టెస్ట్ విజయంలో అతను చేసిన పరుగులు కీలకమని చెప్పాడు.
'ధోనీ బ్యాటింగ్లో నాకు ఎప్పుడూ టెక్నిక్ కనిపించలేదు. నాకే కాదు, చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా మాహీ బ్యాటింగ్ గురించి ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. అయితే టెక్నిక్ లేకపోయినా మహేంద్ర సింగ్ ధోనీ పరుగులు చేశాడు, టీమిండియాకు విజయాలు అందించాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ కోవలోకే వస్తాడు. అతనికి టెక్నిక్ లేదు, అయితే పరుగులు ఎలా చేయాలో బాగా తెలుసు. అయ్యర్కి వీక్నెస్ ఉంది. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఎక్కువగా అవుట్ అవుతున్నాడు. అయితేనేం ఈ ఏడాది ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు.
శ్రేయాస్ అయ్యర్కు ఫామ్తో సంబంధం లేదు. ఫార్మాట్కు తగ్గట్టుగా బ్యాటింగ్ని మార్చుకుని పరుగులు రాబట్టగలుగుతాడు. తొలి ఇన్నింగ్స్లో శ్రేయాస్ అయ్యర్, ఛతేశ్వర్ పూజారా కలిసి చేసిన పరుగులు టీమిండియా విజయానికి కీలకంగా మారాయి. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కడానికి అయ్యర్, పూజారా చేసిన అమూల్యమైన పరుగులే కారణం. శ్రేయాస్ అయ్యర్ మంచి డ్రైవ్ షాట్స్ ఆడగలడు. అంతే కాకుండా క్రీజుని చక్కగా వాడుకుంటాడు. ప్రతీ బ్యాటర్కి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది..
శ్రేయాస్ అయ్యర్కి బౌన్సర్లు ఆడటం రాదు. నాకు తెలిసి తన జీవితాంతం ఈ వీక్నెస్ వెంటాడుతుంది. అయితే కొన్నిసార్లు వీక్నెస్ను తొలగించుకోవాలని ప్రయత్నించడం కంటే మరోదారిలో పరుగులు చేయడానికి ప్రయత్నించడం మంచిది. అయ్యర్ కూడా అదే చేస్తున్నాడు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు. వరల్డ్ బెస్ట్ ఫీల్డర్లలో ఒకడైన మహ్మద్ కైఫ్ .. రిటైర్మెంట్ అనంతరం క్రికెట్ ఎక్స్పర్ట్గా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు.