టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్పై మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియాలోనే రిషభ్ పంత్ డేంజరస్ బ్యాటర్ అని కొనియాడాడు. ఫియర్లెస్ గేమ్ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పాడు. శనివారం మైఖేల్ ప్రతినిథితో ప్రత్యేకంగా మాట్లాడిన అజారుద్దీన్.. రిషభ్ పంత్ను తన ప్రశంసలతో ఆకాశానికెత్తాడు.
ప్రస్తుతం ఔటవుతాననే భయం లేకుండా ఆడే ఏకైక టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్ అని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. 'రిషభ్ పంత్కు ఔటవుతాననే భయం ఏ మాత్రం ఉండదు. అదే అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. రిషభ్ పంత్.. ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహా బ్యాటర్.

గిల్ క్రిస్ట్లానే పంత్ వికెట్ కీపర్ బ్యాటర్. ఏ క్షణంలోనైనా తన విధ్వంసకర ఆటతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. గిల్క్రిస్ట్ కూడా పరిస్థితులతో సంబంధం లేకుండా తొలి బంతి నుంచి బౌలర్లపై దూకుడుగా ఆడేవాడు. పంత్ కూడా ఇలానే ఆడుతాడు. అతనిలో సెహ్వాగ్ బ్యాటింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా బౌలర్లపై సెహ్వాగ్ తరహాలోనే ఎదురుదాడికి దిగుతాడు. ఈ ఇద్దరూ ఆటగాళ్లు సహజమైన రిస్క్ టేకర్స్. తరుచూ తమ బౌండరీ హిట్టింగ్ సామర్థ్యంతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తారు. పంత్ బ్యాటింగ్ చూడ ముచ్చటగా ఉంటుంది. మా తరంలో పంత్లా కపిల్ దేవ్ ఆడేవాడు. కపిల్ పాజీకి ఔటవుతాననే భయం ఉండేది కాదు. అతను తెలివైన బ్యాటర్. బంతిని చాలా దూరం బాదేవాడు. క్రిష్ శ్రీకాంత్ కూడా ఫియర్లెస్ బ్యాటింగ్ చేసేవాడు.

ఇక బ్యాటర్ అనేవాడు ఎప్పటికైనా ఔట్ అవ్వాల్సిందే. ఆ విషయాన్ని గ్రహించి.. దాని గురించి ఆలోచించకుండా బ్యాటింగ్ చేయాలి. క్రీజులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే తరహా అప్రోచ్తో రిషభ్ పంత్ ఆడుతాడు. అందుకే అతను గొప్ప ఆటగాడిగా గుర్తింపు పొందాడు.'అని అజారుద్దీన్ చెప్పుకొచ్చాడు.
బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో రిషభ్ పంత్ శతకంతో రాణించాడు. రోడ్డు ప్రమాదంతో 20 నెలల పాటు టెస్ట్ ఫార్మాట్కు దూరంగా ఉన్న పంత్.. ఇదే మ్యాచ్తో పునరాగమనం చేశాడు. రీఎంట్రీలోనే సెంచరీ చేసి తన రాకను ఘనంగా చాటుకున్నాడు.