హైదరాబాద్: హెచ్సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేస్తానని టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే హెచ్సీఏలో అవినీతిని అంతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చాడు.
అసోసియేషన్ నిబంధనలకు విరుద్దంగా, పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్రికెట్ క్లబ్లపై సుప్రీం నియమించిన రిటైర్డ్ జడ్జీ జస్టిస్ లావు నాగేశ్వరరావు వేటు వేయడాన్ని అజారుద్దీన్ స్వాగతించాడు. అసోసియేషన్ను ప్రక్షాళన చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.

'సెప్టెంబరు 15లోపు జరిగే హెచ్సీఏ ఎన్నికల్లో నేను పోటీ చేస్తా. గత 14 ఏళ్లుగా కొనసాగుతున్న విరుద్ధ ప్రయోజనాల వివాదంపై నిర్ణయం వెలువడినందుకు సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు హెచ్సీఏను సరిగ్గా పని చేయనివ్వలేదు. ఇప్పుడు అసోసియేషన్ మెరుగవుతుంది. నేను ఏ క్లబ్కు యజమానిని కాదు.
అంతర్జాతీయ ఆటగాడిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి నాకు అనుమతి ఉంది. ఆటను, సౌకర్యాలను మెరుగుపరచడం హెచ్సీఏలో అతిపెద్ద సవాల్.
ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి. ఇతర అసోసియేషన్స్ దగ్గర చాలా నిధులు ఉన్నాయి. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి సొంత నిధులు ఉండాలి. మాకిప్పుడు ఒకే మైదానం ఉంది.
మిగతా సంఘాల మాదిరి ఎక్కువ మైదానాలు ఉండాలి. నా పదవీకాలంలో రెండేళ్లు న్యాయ పోరాటాలకే పోయింది. సమస్యలు ఉన్నప్పటికీ నా వంతు కృషి చేశా. మైదానంలో ప్రదర్శన మా స్థాయికి అందుకోలేకపోయింది.'' అని అజారుద్దీన్ చెప్పుకొచ్చాడు.
ఆఫీస్ బేరర్ల ఎన్నిక, గుర్తింపు, యాజమాన్య బదిలీ, మల్టీపుల్ ఓనర్షిప్, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు తదితర ఫిర్యాదులపై సదరు క్లబ్ల ప్రతినిధుల నుంచి వివరణ కోరిన రిటైర్డ్ జస్టిస్ నాగేశ్వర్ రావు.. అనంతరం చర్యలు తీసుకుంటూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాల ప్రకారం 57 క్లబ్లకు చెందిన ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ హెచ్సీఏలో ఎలాంటి పదవీ బాధ్యతలు నిర్వర్తించడానికి వీలు లేదు. ఈ నిషేధం ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ టర్మ్ ముగిసేవరకు లేదంటే మూడేళ్ల పాటు కొనసాగుతోంది. ఎన్నికల్లో ఆయా క్లబ్లకు ఓటు హక్కు కూడా ఉండబోదు. అయితే ఈ క్లబ్లకు చెందిన జట్లు హెచ్సీఏ లీగ్లు, టోర్నీల్లో ఆడేందుకు అనుమతించారు.
57 క్లబ్స్పై నిషేధం విధించడంతో మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, వంకా ప్రతాప్, మాజీ కార్యదర్శి ఆర్. విజయానంద్, మాజీ ఉపాధ్యక్షుడు కె. జాన్ మనోజ్, 1983 ప్రపంచ కప్ జట్టు మేనేజర్ పిఆర్ మాన్ సింగ్, టి. శేష్ నారాయణ్, పి. యాదగిరి, సుదర్శన్ రాజులు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు.