ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహహ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో ఐదుకు ఐదు మ్యాచ్లు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయినా సిరాజ్ ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కోలేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్.. బంతి అందించిన ప్రతీసారి ఫుల్ ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేశాడు.
ఇక సిరాజ్ ఫిట్నెస్ సీక్రెట్ను భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ తాజాగా వెల్లడించారు. సిరాజ్ది నల్లిబొక్క బలమని తెలిపాడు. అతనికి నల్లి ఘోస్ట్ బిర్యానీ(మూలుగు బొక్కల బిర్యానీ), మటన్ పాయ అంటే చాలా ఇష్టమని, ఫేవరెట్ ఫుడ్ అని చెప్పారు.

'ఇంగ్లండ్ పర్యటనలో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. మూలుగు బొక్కల బిర్యానీ, పాయా పుణ్యమా అతను ఫిట్గా మారాడు. ముఖ్యంగా అతని కాళ్లు మరింత బలంగా మారాయి. ఇంగ్లండ్తో సిరీస్లో సిరాజ్ చాలా ఉత్సాహంగా బౌలింగ్ చేశాడు. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చాలనే తపన, జట్టుకు విజయాన్నందించాలనే కసి అతనిలో కనిపించింది.
ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్లో అతను వేసిన స్పెల్ అమోఘం. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ బాధ్యతలను అతను గొప్పగా స్వీకరించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. చాలా పట్టుదలతో బౌలింగ్ చేశాడు. భారత క్రీడల్లో సిరాజ్ ఓ నయా సూపర్ స్టార్'అని అజారుద్దీన్ ప్రశంసించాడు.
ఈ ఐదు టెస్ట్ల సిరీస్ను టీమిండియా 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన చివరి టెస్ట్లో మహమ్మద్ సిరాజ్ అసాధారణ ప్రదర్శనతో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించిన విషయం తెలిసిందే. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. టీమిండియా గెలుపునకు నాలుగు వికెట్లు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిరాజ్ మూడు వికెట్లు తీసి భారత్ సంచలన విజయాన్నందించాడు.